కొణిజర్ల, మే 5: కాంగ్రెస్వన్నీ అలవిగాని హామీలని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారును గ్రామాల్లో ప్రజలు నిలదీసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం కొణిజర్ల మండలంలో పర్యటించిన ఆయన.. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మదన్లాల్తో కలిసి మండల కేంద్రంలో రోడ్షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామా ల నుంచి హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీ హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇన్ని రోజులు గడుస్తున్నా వాటిల్లో ఏ ఒక్క గ్యారెంటీనీ సకాలంలో నెరవేర్చలేదని విమర్శించారు. గత లోక్సభ ఎన్నికల్లో కొణిజర్ల మండలంలో తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఇక్కడి ఓటర్లు.. ఈ ఎన్నికల్లోనూ అంతకుమించిన మెజార్టీని అందించి ఆశీర్వదించాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారులో దేశంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలయ్యాయని అన్నారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గొంతుక వినిపించాలని అన్నారు. అందుకోసం కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కూ రాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, పోట్ల కవిత, పోట్ల శ్రీనివాసరావు, బోడపోతుల బా బు, డేరంగుల బ్రహ్మం, పాముల వెంకటేశ్వర్లు, రామారావు, షేక్ మౌలానా, మోహన్రావు, కిరణ్, మల్లేశ్, నరసింహానాయక్ పాల్గొన్నారు.
ఖమ్మం, మే 5: ‘నేను మన ఊరి రైతు బిడ్డను. మీరూ, నేనూ.. బలపాల గడ్డపై పుట్టి పెరిగాం. నేనేంటో మీకు తెలుసు. మీ ఆత్మీయతను మర్చిపోలేను. మళ్లీ గెలిపిస్తే, మరింత సేవ చేయడం ద్వారా మీ అందరి రుణం తీర్చుకుంటాను’ అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. నామా స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా బలపాల గ్రామం. ఖమ్మంలో స్థిరపడిన బలపాల వాసులతో నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బలపాలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. నామా మాట్లాడుతూ.. బలపాల రైతు బిడ్డగా 25 ఏళ్ల తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. రెండుసార్లు ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశమిస్తే మరింత చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, బలపాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తొలుత, ఆదివారం ఉదయం ఖమ్మం రాపర్తినగర్ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్ను నామా నాగేశ్వరరావు కలుసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత తదితరులు పాల్గొన్నారు. అలాగే, తన తండ్రి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ ఆయన తనయుడు నామా పృథ్వీతేజ ఆదివారం రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో ప్రచారం నిర్వహించారు.