ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 9: ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు తేజా రకం పోటెత్తుతున్నది. వారం రోజుల నుంచి మార్కెట్కు భారీగా ‘ఎర్ర బంగారం’ తరలివస్తున్నది. ఈసారి చీడపీడల కారణంగా పంట కాస్త దెబ్బతిన్నప్పటికీ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఐదు రోజుల క్రితం మార్కెట్కు రైతులు రోజుకు 40 వేల మిర్చి బస్తాలను మార్కెట్కు తీసుకురాగా గురువారం ఆ సంఖ్య 60వేలకు పెరిగింది. ఉదయం జెండాపాటలో ఒక క్వింటా మిర్చికి గరిష్ఠ ధర రూ18,150 పలికింది. మధ్యధర రూ.17వేలు, కనిష్ఠ ధర రూ.12 వేలు పలికింది. తాలు రకానికీ గరిష్ఠ ధర రూ.10 వేలు పలకడం విశేషం. ఏటా పంట దిగుబడి వచ్చే సమయానికి ధరలు కాస్త డల్గా ఉండేవి. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ధరలు పలుకుతున్నాయి.
సీజన్ ప్రారంభంలోనే క్వింటా మిర్చి ధర రూ.18 వేలు దాటడం గమనార్హం. వారం రోజుల్లో రైతులు 3 లక్షల బస్తాలకు పైగా మిర్చిని రైతులు విక్రయించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ధరలు బాగుండడంతో ఏ రైతూ పంటను కోల్డ్స్టోరేజ్ల్లో నిల్వ చేసేందుకు ఇష్టపడడం లేదు. పంటకు చేతికి రాగానే ఏఎంసీకి మిర్చి తీసుకొస్తున్నారు. పాలకవర్గ సభ్యులు, మార్కెటింగ్శాఖ అధికారులు సకాలంలో క్రయ విక్రయాలు పూర్తి చేస్తున్నారు.