పల్లె ప్రగతిలో అశోక్నగర్ ముందంజ
ప్రకృతి వనంలో మొక్కల పెంపకం
అన్ని వసతులతో ఆఖరి మజిలీ
అందరి సమన్వయంతో అభివృద్ధి బాట
లక్ష్మీదేవిపల్లి, మార్చి 30: మండలంలోని అశోక్నగర్ పంచాయతీ అంటే ఒకప్పుడు మురుగుకూపానికి మారుపేరుగా ఉండేది. లోతట్టు ప్రాంతం కావడంతో మున్సిపాలిటీలోని మురుగునీరంతా గ్రామంలోకి వచ్చేది. ఊరును ముంచుతూ వెళ్లి వాగులో కలిసేది. దీంతో గ్రామమంతా మురుగునీటితో నిండిపోయేది. ఇక వర్షాకాలం వచ్చిందంటే బురద సమస్య మరింత తీవ్రంగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించింది. లక్ష్మీదేవిపల్లి మండలంలో అశోక్నగర్ పంచాయతీ ఏర్పడిన తర్వాత ప్రత్యేక నిధులను మంజూరు చేస్తోంది. దీంతో అభివృద్ధి పనుల నిర్వహణకు అవకాశం కలిగింది. దీంతో గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామస్తులకు కష్టాలు ఒక్కోక్కటిగా తొలగిపోయాయి. దీనిపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సైడ్ డ్రెయిన్ల నిర్మాణం..
మున్సిపాలిటీ పరిధిలోని మురుగునీటిని ముర్రేడు వాగులోకి వదిలేవారు. ఆ నీరు అశోక్నగర్ పంచాయతీ మీదుగా వెళ్లాల్సి ఉండేది. అయితే గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడంతోపాటు పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టడంతో పంచాయతీ రూపురేఖలు మారిపోతున్నాయి. ముఖ్యంగా పంచాయతీలో మురుగు యేందుకు వీలుగా సైడ్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు. దీంతో రోడ్డుపై మురుగు నిల్వ ఉండకుండా నేరుగా వెళ్లిపోతోంది. అలాగే మున్సిపాలిటీ నుంచి వచ్చే మురుగు ముర్రేడువాగులో కలిసేందుకు ప్రత్యేకంగా డ్రెయినేజీని నిర్మించారు. గ్రామంలో నాలుగు సైడ్ డ్రెయిన్లను నిర్మించడంతో మురుగునీరు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. మరికొన్ని డ్రెయినేజీల నిర్మాణం కొనసాగుతోంది. ఈ నిర్మాణాలు పూర్తయితే గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండకుండా ఉంటుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పల్లెప్రగతి పనులు చకచకా..
ఇక గ్రామంలో పల్లె ప్రగతి పనులు చకచకా జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉండేందుకు చెత్త ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉండేందుకు డంపింగ్యార్డుల నిర్మాణం కొనసాగుతోంది. ఇక గ్రామస్తులు ఆహ్లాదంగా గడిపేందుకు పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు వీలుగా వైకుంఠధామ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక గ్రామ పంచాయతీ పరిధిలో ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. ఈ పనులు జరుగుతుండటంతో గతంలో ఉన్న అశోక్నగర్ గ్రామ పంచాయతీకి.. ప్రస్తుతం ఉన్న అశోక్నగర్కు పూర్తి మార్పు వచ్చినట్లయింది. అభివృద్ధి జరుగుతుండడంతో తమ కష్టాలు ఒక్కటొక్కటిగా తీరుతున్నాయంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేగంగా అభివృద్ధి పనులు..
‘ప్రభుత్వం గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు, శ్మశాన వాటిక పనులు పూర్తికావొచ్చాయి. గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నాం. అశోక్నగర్ పంచాయతీలో మురుగునీరు నిల్వ ఉండకుండా సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టాం. మరిన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.’
-ఈసం నరేశ్, సర్పంచ్
ఇవి కూడా చుడండి
నోముల భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి తలసాని
ఆదివాసీ తెగల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ