నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థించారు.
భగత్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంగళవారం భగత్ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం నాగార్జున సాగర్లో జరిగిన యాదవ సంఘం ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. యాదవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారని అన్నారు.
యాదవులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించింది టీఆర్ఎస్ పార్టీయేనని గుర్తుచేశారు. గ్రామగ్రామాన తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.
భగత్ విజయం అందరి గెలుపుగా భావించి గెలిపించేందుకు కృషిచేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన గురువయ్య యాదవ్, నియోజకవర్గ నాయకులు మన్నెం రంజిత్ యాదవ్, పెద్దబోయిన శ్రీనివాస్, కట్టెబోయిన గోవర్ధన్ యాదవ్, యాదవ ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.