ఖమ్మం, మార్చి 29: అన్నపూర్ణ పథకం ద్వారా నిరుపేదలకు, వివిధ పనుల మీద నగరానికి వచ్చి మధ్యాహ్నం వేళల్లో ఆకలితో ఇబ్బందిపడే వారికి, కూలీలకు కడుపునిండా భోజనం పెట్టే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ఖమ్మంలో అన్నపూర్ణ భోజన పథకాన్ని ఏర్పాటు చేయడంలో మంత్రి అజయ్ పాత్ర ఎంతో ఉంది. ఆయన కృషి కారణంగానే ఖమ్మంలో మూడు చోట్ల ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి.
రోజుకు వెయ్యిమందికి భోజనం..
ఖమ్మంలోని మూడు కేంద్రాల్లో ఒక్కొక్కరికీ రూ.5 చొప్పున రోజుకు సుమారు వెయ్యి మంది కడుపునిండా భోజనం చేస్తున్నారు. పెవిలియన్ గ్రౌండ్ వద్ద రోజుకు 350 మందికి, గాంధీచౌక్లో రోజుకు 350 మందికి, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రోజుకు 300 మందికి భోజనం పెడుతున్నారు. 2019 ఫిబ్రవరి 20న ఖమ్మంలో ఈ అన్నపూర్ణ భోజన కేంద్రాలను అప్పటి ఖమ్మం శాసనసభ్యుడుగా ఉన్న పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. ఆ తరువాత 2020 ఫిబ్రవరి 10న బైపాస్రోడ్లోగల ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మరో అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ మూడు కేంద్రాల్లో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. లాక్డౌన్ టైంలోనూ ఈ కేంద్రాలు విజయవంతంగా కొనసాగాయి. ఆ టైంలో వలస కూలీలకు ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగపడ్డాయి. తొలుత హైదరాబాద్లో ప్రారంభమైన ఈ పథకం తర్వాత మున్సిపాలిటీలకూ విస్తరించింది.
రూ.5కే కడుపునిండా భోజనం..
అన్నపూర్ణ భోజన పథకం ద్వారా ప్రజలకు రూ.5కే భోజనం అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం హరేకృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్కు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజన కేంద్రాల్లో భోజనాన్ని ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీ ఒక్కొక్క భోజనానికి అక్షయపాత్ర ఫౌండేషన్కు రూ.19.75 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.5 భోజనం చేసిన వ్యక్తి నుంచి వస్తాయి. సేవా దృక్పథంతో అక్షయపాత్ర ఫౌండేషన్ రూ.25కే భోజనం అందిస్తోంది. సాధారణంగా మున్సిపాలిటీల్లో భోజనం చేయాలంటే ఈ రోజుల్లో కనీసం రూ.100 అవుతుంది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి..
ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ ఈ కేంద్రాల్లో భోజనం పెడతారు. సరిపడినంత అన్నం, 125 గ్రాముల పప్పు లేదా సాంబారు. 100 గ్రాముల కూర, 15 గ్రాముల చట్నీ, ఒక వాటర్ ప్యాకిట్, పేపర్ ప్లేట్ను అందిస్తారు.
రూ.53 లక్షలు చెల్లించిన కేఎంసీ
2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన నాటి నుంచి గత ఏడాది సెప్టెంబర్ 25 వరకు రూ.32, 77,534ను ఫౌండేషన్కు కేఎంసీ అప్పగించింది.
అజయ్ చల్లంగుండాలి..
‘రూ.5 భోజనం ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. తింటుంటే చాలా రుచిగా ఉంది. రెండేళ్ల కింద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అజయ్కుమార్ ఈ కేంద్రాలను ప్రారంభించిండంట. ఆయన వల్ల నాలా ఖమ్మం వచ్చే ఎంతో మందికి కడుపు నిండుతోంది. అజయ్కుమార్ ఎప్పుడూ చల్లంగుండాలి.’ -వనం దుర్గాప్రసాద్
కేసీఆర్ వచ్చాకే ఇలాంటివన్నీ..
‘తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పేదల బతుకులు బాగుపడ్డాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చాకే ఇలాంటి మంచిపనులు జరుగుతున్నాయి. ఆయనే లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ఈ రోజుల్లో రూ.5కు ఏ వస్తువూ రాదు. అలాంటిది కడుపునిండా భోజనం పెట్టడం మామూలు విషయమేమీ కాదు.’
-రాజేశ్