నేడు నిరాడంబరంగా వసంతోత్సవం
రేపు చక్రతీర్థం, పూర్ణాహుతి
భద్రాచలం, ఏప్రిల్ 25: భద్రాద్రి రామాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రామయ్య తండ్రికి అర్చకులు ఊంజల్ సేవ నిర్వహించారు. ఉదయం యాగశాలలో చతుఃస్థానార్చన, హోమం, ఆలయ ఆస్థాన విద్వాంసులచే నాదస్వర కచేరి జరిపారు. పవిత్ర గోదావరి నదీ జలాలు, పంచామృతాలతో స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. వేద పండితులు వేద పారాయణం చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, సమస్త మంగళవాయిద్యాలతో, వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారిని ప్రాకార మండపంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాఃవాచన జరిపారు. అనంతరం అర్చకులు స్వామివారికి వేద విన్నపాలు చేశారు. బేడా మండపంలో పుణ్య జలాలతో ఊయలను ప్రోక్షించి, ఊయల చుట్టూ మంగళ తోరణాలు, వసంత ఋతువులో లభించే ఫలాలను సమర్పించారు. సీతమ్మ తల్లికి తొమ్మిది రకాల పుష్పాలతో పూల జడను, రామయ్య తండ్రికి గజమాలను, రామదాసు తయారు చేయించిన దివ్యాభరణాలను అలంకరించారు. అనంతరం కుంభ, ధ్వజ, అష్ట, ద్వాదశ, నక్షత్ర హారతులను అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వైదిక పెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు వసంతోత్సవం
సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించనున్నారు. మంగళవారం చక్రతీర్థం, పూర్ణాహుతి జరుపుతారు.