ఖమ్మం, మార్చి 13: గడిచిన పది రోజులుగా తాగునీరు ఇవ్వకుంటే ఎలా అని ఖమ్మం 25వ డివిజన్ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని గుర్తుచేశారు. నల్లాల ద్వారా తాగునీళ్లు అందించాలని ప్రభుత్వానికి, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పది రోజులుగా మున్సిపల్ నీటి సరఫరా నిలిచిపోవడం ఏంటని ప్రశ్నించారు.
ఈ మేరకు స్థానిక మహిళలు 25వ డివిజన్ గాంధీపార్ ప్రాంతం వద్ద బుధవారం ఉదయం ఖాళీ బిందెలతో రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిరోజూ తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.