తల్లిదండ్రుల్లారా.. ఒక్క క్షణం ఆలోచించండి.. రూ.వేల ఫీజు చెల్లిస్తేనే చదువొస్తుందా..? పట్టణాలు, నగరాలకు వెళ్తేనే ఆంగ్ల బోధన అబ్బుతుందా..? మీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులు మన సర్కారు బడిలోనూ ఉన్నారు. వారి ఉన్నతికి బాటలు వేసి బంగారు భవిష్యత్ కోసం పరితపిస్తూ మార్గదర్శకులుగా నిలుస్తున్నారనే విషయం గుర్తించండి..
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్కు దీటుగా సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు విద్యాబోధనలోనూ ప్రైవేట్ను మించిపోతున్నది. ర్యాంకులు, పోటీ పరీక్షల్లోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దూసుకెళ్తున్నారు. చదువు, క్రీడలు, తదితర అంశాల్లో అవకాశమే హద్దుగా ముందుకు సాగుతున్నారు. దీంతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కారు బడిలో చేర్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ప్రైవేట్ వద్దు.. ప్రభుత్వ పాఠశాలే ముద్దు’ అని నినదిస్తున్నారు. గురువులుగా.. మన బడులను మనమే కాపాడుకుందామంటూ ముక్తకంఠం వినిపిస్తున్నారు. తమ పిల్లలను సర్కార్ బడిలో చదివిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులపై
ఎర్రుపాలెం మండలంలోని ఎంపీపీఎస్ బనిగండ్లపాడు పాఠశాలలో పోతినేని గిరిబాబు ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కుమార్తె లహరి 7వ తరగతి, మేఘన 6వ తరగతి తండ్రి పనిచేస్తున్న బడిలోనే చదువుతున్నారు. ‘స్వయంగా నేనూ సర్కార్ టీచర్నే. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తారని నమ్మకం ఉంది..’ అని ఘంటాపథంగా వెల్లడిస్తున్నారు గిరిబాబు.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఇలా..
ఎర్రుపాలెం మండలంలో వీ లక్ష్మారెడ్డి(ఎస్జీటీ), ఎ.శిరీష(ఎస్జీటీ), బి.నాగరాజు(ఎస్ఏ మ్యాథ్స్), ఎం.సీతారామలక్ష్మి (ఎస్జీటీ), డి.నరసింహారావు (ఎస్ఏ ఫిజికల్ సైన్స్), ఇ.చంద్రమౌళీశ్వరరెడ్డి (ఎస్ఏ ఫిజికల్ సైన్స్), ఎస్.ఫిలిఫ్(ఎస్జీటీ), వైరా మండలంలో పి.కృష్ణ(ఎస్జీటీ), వేంసూరు మండలంలో వి.శివరామకృష్ణ(ఎస్ఏ మ్యాథ్స్), ఎం.నరసింహారావు(ఎస్జీటీ), సీహెచ్ సంధ్య(ఎస్జీటీ), పెనుబల్లి మండలంలోవి.రవికుమార్ (ఎస్జీటీ), వి.మహేశ్ (ఎస్ఏ మ్యాథ్స్), నేలకోండపల్లి మండలంలో బి.గాంధీ (ఎస్జీటీ), కె.నర్సయ్య (ఎస్జీటీ), టి.వెంకన్న (ఎస్జీటీ), ఎం.సత్యనారాయణ (ఎస్జీటీ), బి.వెంకటేశ్వర్లు (ఎస్జీటీ), బి.మంగమ్మ (ఎస్జీటీ), పి.మంగేశ్వరి (ఎస్జీటీ), టి.సావిత్రి (ఎస్జీటీ), ఏన్కూరు మండలంలో ఎల్.శంకర్ (ఎస్ఏ మ్యాథ్స్), ఎం.వెంకటనారాయణ(ఎల్పీ హిందీ), ఖమ్మం రూరల్ మండలంలో భీమరాజు(ఎస్ఏ సోషల్), టి.వీరన్న (ఎల్పీ తెలుగు), పి.స్వామి (ఎస్జీటీ), ఎస్.శ్రీనివాస్గౌడ్ (ఎస్జీటీ), ఎం.నాగప్రసాద్ (పీఈటీ), మధిరలో ఎం.సుబ్బారావు (ఎస్జీటీ), టి.అజయ్కుమార్ (ఎల్పీహెచ్), వి.వీణ (ఎస్జీటీ), ఎం.చిన్న వెంకటరావు (ఎస్జీటీ), కె.కృష్ణవేణి (ఎస్ఏ ఫిజిక్స్), బి.రాణి (ఎల్పీటీ), పి.జ్యోతిర్మయి (ఎస్ఏ ఇంగ్లిష్), డి.స్వర్ణలత (ఎస్జీటీ), మహ్మమద్ (ఎస్జీటీ), నవీన్(పీజీటీ), ఆంజనేయులు (క్రాఫ్ట్స్), బి.చైతన్య (పీఈటీ), కమల్ (ఎస్జీటీ), ఎస్.అక్బర్ (ఎస్ఏ బయాలజీ), బి.బీన్శంకర్రావు (ఎస్ఏ ఫిజిక్స్), కె.రాము (పీఈటీ), ఎం.రవీందర్ (ఎస్ఏ ఇంగ్లిష్), తిరుమలాయపాలెం మండలంలో బి.ఉపేందర్రావు (ఎస్జీటీ), ఎండీ మక్సూద్ అలీ (ఎస్ఏ), ఎస్కే ఆదాం (ఎస్ఏ), ఉపేందర్ (ఎస్జీటీ), బీవీఆర్ విజయకృష్ణ (ఎస్జీటీ), సీహెచ్ రమ (ఎస్జీటీ), ఎన్.స్వప్న (ఎస్జీటీ), కె.రాఘవ రాయి(ఎస్జీటీ), రమ (ఎస్జీటీ), ముకుంద్రావు (ఎల్పీ), కె.లావణ్య (ఎస్ఏ), ముదిగొండ మండలంలో వి.రవికిరణ్ (ఎస్జీటీ), కిరణ్(ఎస్జీటీ), ఎస్కే జాన్సైదులు (ఎస్జీటీ), జాస్మిన్ (ఎస్జీటీ), బి.నాగేశ్వరరావు (ఎస్జీటీ), జి.శ్రీనివాసరావు (ఎస్ఏ), చింతకాని మండలంలో షేక్ షరీఫ్ (ఎస్జీటీ) తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు.
సర్వే ద్వారా గుర్తింపు..
ప్రత్యక్ష తరగతుల కోసం పాఠశాలలను సిద్ధం చేసే క్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖలోని ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో కొందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం డీఈవో యాదయ్య వారి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని సెక్టోరల్ అధికారులను ఆదేశించారు. డీఈవో సూచనలతో సెక్టోరల్ అధికారులు నివేదిక రూపొందించారు.
చింతకాని మండలంలోని ఎంపీపీఎస్ ప్రొద్దుటూర్ పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్న షేక్ షరీఫ్ తన కుమార్తె ఎస్కే అయేషా జుల్పాని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే చదివిస్తున్నాడు. ప్రస్తుతం ఆమె పదో తరగతి చదువుతున్నది. ‘ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం.. తరగతులు పూర్తి కాగానే కలిసి ఇంటికి వస్తాం..’ అంటున్నారు ఉపాధ్యాయుడు షరీఫ్.
వేంసూర్ మండలంలోని అడసర్లపాడు జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు వేదుల శివరామకృష్ణకు ఇద్దరు పిల్లలు. కుమారుడు ధృవ వేణు గోపాలకృష్ణ 1వ తరగతి, కుమార్తె గోపికా శరణ్యకృష్ణ 4వ తరగతి చదువుతున్నారు. వీరు ఇదే మండలంలోని ఎంపీయూపీఎస్ బీరపల్లి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారు. ‘ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని సమాజానికి చెప్పడానికే పిల్లలను సర్కార్ బడికి పంపుతున్నా..’ అని శివరామకృష్ణ వెల్లడిస్తున్నారు.