మామిళ్లగూడెం, మే 5: ఎన్పీడీసీఎల్ మొత్తం 17 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ సంస్థ పరిధిలో 61,74,19 లోటెన్షన్ (ఎల్టీ) విద్యుత్ మీటర్లు, 3,211 హైటెన్షన్ (హెచ్టీ) మీటర్లు కలిపి మొత్తం 61,77,230 విద్యుత్ మీటర్లు ఉన్నాయి. ఇందులో 15,02,974 వ్యవసాయ, హెచ్టీ విద్యుత్ కనెక్షన్లు మినహాయిస్తే మిగతా 60,51,467 విద్యుత్ మీటర్లకు ప్రతినెలా స్పాట్ బిల్లింగ్ సిబ్బంది వెళ్లి రీడింగ్ నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు చేసిన తర్వాత వినియోగదారుడు సమీప ఈఆర్వోలో క్యూలో నిలుకొని బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి బిల్లు కట్టాలి. ఈ ప్రక్రియలో అనేక మందికి కరోనా ప్రమాదం పొంచి ఉంది. ఇందుకోసం వినియోగదారులు సులభంగా తమ ఇంటి మీటరు బిల్లును తామే రీడింగ్ తీసుకుని ఆన్లైన్లోనే చెల్లించేలా ఎన్పీడీసీఎల్ పేరుతో ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది.
యాప్ ఎలా పని చేస్తుందంటే..
ప్లేస్టోర్ నుంచి టీఎస్ఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను ఓపెన్ చేసి అందులో సెల్ఫ్ రీడింగ్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సబ్ సెల్ఫ్ రీడింగ్ను ఎంచుకుని వినియోగదారుని యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసిన కన్ఫర్మ్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ ఎంటర్ చేసి కేడబ్ల్యూహెచ్పై క్లిక్ చేసి మీటర్ లోపల ఉండే కేడబ్ల్యూహెచ్ రీడింగ్ను స్కాన్ చేసే సమయంలో ‘భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ నొక్కితే మీరు ఈ నెలలో వినియోగించుకున్న బిల్లు మెస్సేజ్ రూపంలో వస్తుంది. ఈ బిల్లును ఆన్లైన్లో చెల్లించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికైతే ఈ సెల్ఫ్ రీడింగ్ విధానం కరోనా తీవ్రంగా ఉన్న ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత పరిశీలిస్తారు. సెల్ఫ్ రీడింగ్ తీసుకోకుంటే స్పాట్ బిల్లింగ్ కార్మికులు కూడా వచ్చి రీడింగ్ తీస్తారు.
ఆన్లైన్ చెల్లింపులే మేలు
కరోనా నేపథ్యంలో ఆయా కార్యాలయాలకు వెళ్లి బిల్లులు చెల్లించడం కంటే ఆన్లైన్లోనే చెల్లింపులే మేలని సీఎండీ గోపాల్రావు సూచిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ వెబ్సైట్, పేటీఎం, ఫోన్ పే, బిల్ డెస్క్, ఎన్పీడీసీఎల్ యాప్ల ద్వారా సులభంగా చెల్లించవచ్చు.
డైరెక్టర్లతో సీఎండీ ప్రత్యేక సమావేశం
ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాలో తీసుకుంటున్న కరోనా జాగ్రత్త చర్యలను సీఎండీ అన్నమనేని గోపాల్రావు సంస్థ డైరెక్టర్లకు విద్యుత్భవన్లో బుధవారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. కార్పొరేట్ కార్యాలయంతోపాటు సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో 24 గంటల పాటు నిరంతరంగా పనిచేసేందుకు హెల్ప్లైన్లు ఏర్పాటుచేశామని చెప్పారు. విద్యుత్ సమస్యలు ఉన్నట్లయితే 1800 425 0028, 1912 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.