ఖమ్మం, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ కళాశాలలో సోమవారం నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనుంది. గత నెల 30న కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ నిర్వహించగా ఈనెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కళాశాలలో 10 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 250 మంది కౌంటింగ్ సిబ్బంది ఒక్కో కేంద్రంలో ఆరు డివిజన్ల ఓట్లను లెక్కించనున్నారు. లెక్కింపునకు ఒక్కో డివిజన్కు మూడు టేబుళ్లు కేటాయించారు.లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. అధికారులు స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో తెరవనున్నారు. విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రం సమర్పిస్తేనే కౌంటింగ్ హాల్లోకి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. లెక్కింపు కేంద్రాలను ఆదివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. పోలీసులు కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు.
గులాబీదే హవా..?
టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ఖాయమని, నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుని తీరుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిప్యూటీ మేయర్, కో-ఆప్షన్ పదవులతో సహా అన్ని పదవులూ ‘గులాబీ’ సొంతమని భావిస్తున్నాయి. నగర ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గుచూపారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ హవానే కొనసాగుతుందంటున్నారు. కార్పొరేషన్ ఎన్నిక జరిగిన రోజున కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లు దొరకలేదంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కాంగ్రెస్, సీపీఎంలు స్వల్పంగా ప్రభావం చూపే అవకాశం ఉందని, బీజేపీ ఖాతా తెరవడమూ కష్టమేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీపీఐ, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడంతో సీపీఐ అభ్యర్థులు పోటీ చేసిన మూడు స్థానాల్లో గెలుఫు ఖాయమంటున్నాయి. పోలింగ్శాతాన్ని బట్టి మొత్తంగా టీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉన్నది. పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధిస్తారని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అభ్యర్థుల్లో ఉత్కంఠ..
పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి.. ఎవరిని విజయం వరిస్తుందన్న అంశంపై పోటీ చేసిన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. తమకున్న విజయావకాశాలను అంచనా వేస్తూ, పోలింగ్ సరళిని అంచనా వేస్తూ గెలుపు, ఓటములను విశ్లేషించుకుంటున్నారు. ఓటింగ్ తమకు సానుకూలంగా ఉందని, ఖమ్మం ఓటర్లు మరోసారి అభివృద్ధి వైపు నిలుస్తారని టీఆర్ఎస్ అభ్యర్థులు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో జరిగిన నగర అభివృద్ధిని ప్రజలు ఆశీర్వదించారని భావిస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
ఖమ్మం, మే2 : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రకియ ఏర్పాట్లను ఆదివారం ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ను నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ టేబుళ్ల అమరిక, సీటింగ్ ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. కౌంటింగ్ కేంద్రాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలన్నారు. కౌంటింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది, పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు ప్రతిఒక్కరినీ కొవిడ్ -19 నిర్ధారణ పరీక్ష రిపోర్ట్ ఆధారంగానే అనుమతి ఉంటుందన్నారు. తాగునీరు, షామియానాలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్తో పాటు నగర పాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్అండ్బీ ఎస్ఈ లక్ష్మణ్, నగరపాలక సంస్థ ఎస్ఈ ఆంజనేయప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నగరంలో 144 సెక్షన్ అమలు
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నగరంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 144 సెక్షన్ విధించారు. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుంచి 4వ తేది ఉదయం 9 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉండగా నగరంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.