త్వరలో నల్గొండ, రామగుండం, సిద్దిపేటలోనూ..
రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్
ఖమ్మంలో 2వ దశ ‘ఐటీ హబ్’కు శంకుస్థాపన..
నూతన బస్టాండ్, వైకుంఠధామం ప్రారంభోత్సవం
ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి: మంత్రి అజయ్
ఖమ్మంలో గణనీయమైన అభివృద్ధి : మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
సీతారామ’ ప్రాజెక్టుతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం: ఎంపీ నామా
ఇకపై ద్వితీయ శ్రేణి పట్టణాలకూ ‘ఐటీ టవర్స్’
ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 2: ఐటీ హబ్తో ఖమ్మం నగరానికి కొత్తకళ వచ్చిందని, రెండో ఫేజ్ అందుబాటులోకి వస్తే వందలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం నగరంలో నిర్మించిన నూతన బస్టాండ్, టేకులపల్లిలో డబుల్బెడ్రూం ఇళ్లు, మిషన్ భగీరథ పథకం, వైకుంఠధామాల ప్రారంభోత్సవం, ఐటీ హబ్లో రెండోదశ పనులకు ఆయన మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మమే ఐటీ రంగానికి కేరాఫ్గా నిలుస్తుందన్నారు. నగరంలో మరో మూడు సమీకృత మార్కెట్లు నిర్మిస్తామని, రెండు వైకుంధామాలను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. మున్నేరుపై కరకట్ట నిర్మాణం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చిస్తామన్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ నగరంలో జరగని అభివృద్ధి ఖమ్మంలో జరిగిందన్నారు. మంత్రి అజయ్ మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో ఖమ్మం నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఐటీ హబ్ ఉపాధికి కేరాఫ్గా నిలుస్తుందన్నారు.
ఐటీహబ్తో ఖమ్మం నగరానికి కొత్తకళ వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం నగరంలో రూ.25 కోట్లతో నిర్మించిన నూతన బస్టాండ్ను ప్రారంభించారు. రూ.36 కోట్లతో 2వ దశ ఐటీ హబ్, రూ.30 కోట్లతో 11, 48వ డివిజన్లలో నిర్మించనున్న సీసీ, బీటీ పనులకు ఆర్అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నగరంలో ఐటీ హబ్, మోడల్ మార్కెట్లు, వైకుంఠధామం, అన్ని హంగులతో నూతన బస్టాండ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టానికి కొత్త పెట్టుబడులు తీసుకువస్తున్నారన్నారు. తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్నదన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-14లో మన ఐటీ ఎగుమతులు కేవలం రూ.56 వేల కోట్లు ఉండేవని, 2021వ సంవత్సరానికి రూ.లక్ష నలభై వేల కోట్లకు ఎగబాకిందన్నారు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి ప్రఖ్యాత సంస్థలకు ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందని, సాధారణంగా ఆ పెట్టుబడులను బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, పూణే వంటి మహా నగరాల్లో పెడతాయన్నారు. కానీ వాటన్నింటినీ కాదని ఆయా సంస్థలు హైదరాబాద్ను ఎంచుకుంటున్నాయన్నారు.
అందుకు టీఎస్ ఐపాస్, అవినీతి రహిత పరిపాలనే కారణమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ రంగం కేవలం హైదరాబాద్కే పరిమితం కాకూడదని, ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తున్నామన్నారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు ఐటీ హబ్లు ఏర్పడ్డాయని, త్వరలో నల్గొండ, రామగుండం, సిద్దిపేటలోనూ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో టీ ఫైబర్ ప్రాజెక్ట్ పూర్తవుతున్నదన్నారు. ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇస్తామన్నారు. ఖమ్మం నగరాభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామని, మూడు సమీకృత మార్కెట్లను నిర్మించి, రెండు వైకుంఠధామాలను ఆధునీకరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడంలో మంత్రి అజయ్ కృషి ఎనలేనిదన్నారు. మంత్రి అజయ్ విజ్ఞప్తి మేరకు మున్నేరుకు కరకట్ట నిర్మించే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడతాన్నారు. ఖమ్మంలో గోళ్లపాడు గోస తీర్చామని, నిర్వాసితులకు ఆసరా కల్పించామన్నారు. అనంతరం నగరంలోని కాల్వొడ్డులో ఆధునిక హంగులతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. తర్వాత ఐటీ హబ్ రెండో దశలో సేవలు అందించేందుకు టెక్నో వేవ్, సాప్ట్ స్టాండర్డ్, రుధిర టెక్నాలజీస్, థర్డ్ ఐ సొల్యుషన్స్, ఛాయి స్మార్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులతో ఎంఓయూ పూర్తిచేయించారు.
క్యాంపస్ నియామకాల ప్రక్రియలో కొలువులు సాధించిన అభ్యర్థులకు మంత్రులు కాల్ లెటర్స్ అందజేశారు. కార్యక్రమాల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, లావుడ్యా రాములునాయక్, జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆర్టీసీ ప్రిన్సిపల్ సెక్రటరి సునీల్శర్మ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్టీసీ ఈడీ పురుషోత్తంనాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్, మాజీ మేయర్ గుగులోత్ పాపాలాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, ఐటీ హబ్ కో- ఆర్డినేటర్ ల్యాక్ చేపూరి, పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి, కార్పొరేటర్ నాగరాజు, ఆర్టీసీ ఈడీలు, డీఎంలు పాల్గొన్నారు.
ఖమ్మంలో గణనీయమైన అభివృద్ధి
-మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
తెలంగాణలో ఏ పట్టణం, నగరంలో జరగని అభివృద్ధి ఖమ్మంలో జరిగిందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పట్టణ, నగరవాసులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు. తాను ఇటీవల దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లాలని, పట్టణాలు, నగరాలను సందర్శించానన్నారు. ఎక్కడా ఖమ్మంలో జరిగిన అభివృద్ధిలో 10శాతం కూడా జరగలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం తీసుకువచ్చినా మంత్రి అజయ్కుమార్ చొరవతో ఖమ్మం ప్రజలకు వెంటనే అందుతున్నాయన్నారు. పట్టుదల ఉన్న వ్యక్తిగా మంత్రి అజయ్ ప్రజలకు మంచి చేస్తున్నారని కొనియాడారు.
ఉమ్మడి జిల్లాలో 40వేల కోట్లతో అభివృద్ధి
పట్టువదలని విక్రమార్కుడు అజయ్..
‘మంత్రి అజయ్ ఏదైనా అనుకుంటే సాధించి తీరుతడు. పనులు మంజూరు చేయించుకోవడమే కాదు.. ఆ పని పూర్తయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుడవుతాడు. ఖమ్మం నగరానికి ఏం కావాల్నో, ఇక్కడి ప్రజలకు ఏం ఇవ్వాల్నో అజయ్కి బాగా తెలుసు. సీఎం కేసీఆర్ ఎప్పుడు చెబుతా ఉంటరు. ఒక పని ఎత్తుకుంటే అది పూర్తయ్యేంత వరకు ఏకాగ్రతతో పనిజేయాలని. ఇదే స్ఫూర్తితో మంత్రి అజయ్ పనిచేస్తున్నారు.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
గేటెడ్ కమ్యూనిటీలా ‘డబుల్’ ఇళ్లు
రఘునాథపాలెం, ఏప్రిల్ 2: గేటెడ్ కమ్యూనిటీని తలిపించేలా 1004 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్రూం పథకంలో భాగంగా నగరంలోని టేకులపల్లిలో రూ.61.53కోట్లతో 1004 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రులు అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అలాగే రూ.229 కోట్ల వ్యయంతో నిర్మించిన అమృత్ పథకం, మిషన్ భగీరథలో భాగంగా నీటిసరఫరాను ప్రారంభించారు. వారి వెంట ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కమిషనర్ అనురాగ్ జయంతి, అర్బన్ మాజీ ఎంపీపీ దొంగల ఇందిర, 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆత్కూరి హనుమాన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
రజనీకాంత్ తో ఈ ఫోటోలో ఉన్న సూపర్ స్టార్ ఎవరో తెలుసా..?
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?
క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
బాతుపిల్లకు సింహం సాయం.. వైరల్ వీడియో