టన్ను గెలల ధర రూ. 17,361
అశ్వారావుపేట, ఏప్రిల్ 2: పామాయిల్ గెలల చెల్లింపులో ఆయిల్ఫెడ్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలో చెల్లించని విధంగా టీఎస్ ఆయిల్ఫెడ్ ఏప్రిల్ నుంచి ఆయిల్పాం గెలలకు అత్యధిక ధర చెల్లిస్తున్నది. జనవరి నుంచి ఆయిల్పాం గెలల ధరను రైతులు ఆశించిన దాని కంటే సంస్థ ఎక్కువగానే అందిస్తున్నది. గత నెలలో టన్ను ఆయిల్పాం గెలల ధర రూ.15,923 ఉండగా ఏప్రిల్ నెలకు ఏకంగా రూ.1,441లకు పెరిగి రూ.17,364కు చేరింది. రైతులు కొన్నేళ్ళుగా టన్ను గెలల ధర రూ.10 వేలకు పైగా ఉండాలని కోరుతున్నారు. జనవరి లో టన్ను గెలల ధర రూ.14,416 ఉండగా ఫిబ్రవరి కి రూ.15,147కు చేరింది. మార్చి నెలలో ఈ ధర మరింత పెరిగి రూ. 15,923 కు ఎగబాకింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధికారులు ధరను నిర్ణయించారు. ధర పెరుగుదల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.17,364 కు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన గెలల ధరను ఏప్రిల్ నెలకు రైతులకు అందిస్తామని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి తెలిపారు.
రైతులు సంతృప్తి
గత ఏడాది డిసెంబర్ నెల నుంచి ఆయిల్ఫెడ్ అందిస్తున్న ఆయిల్పాం గెలల ధరతో రైతులు సంతృప్తికరంగా ఉన్నారు. రైతులకు దీర్ఘకాలికంగా నికర ఆదాయం అందించే ఆయిల్పాం సాగు పట్ల ఇతర వర్గాల రైతులు మొగ్గు చూపుతున్నారు. పక్వానికి వచ్చిన గెలలు, కాడ ఎక్కువ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. -ఆకుల బాలకృష్ణ, డివిజనల్ ఆఫీసర్, ఆయిల్ఫెడ్, అశ్వారావుపేట