ఖమ్మం బస్టాండ్ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
రూ.423 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ఖమ్మం, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం పర్యటించనున్నారు. ఆయన మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి జిల్లాలో దాదాపు రూ.423 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఖమ్మం నగరం అభివృద్ధికి వేదికగా నిలుస్తున్నది. ఇప్పటికే ఖమ్మం ప్రగతి పథంలో పయనిస్తూ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుండగా.. తాజాగా మరిన్ని అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలకు సిద్ధమైంది. రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనకు ఖమ్మం ముస్తాబైంది. కేటీఆర్తోపాటు రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో దాదాపు రూ.423 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రుల పర్యటన కోసం జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం, సత్తుపల్లిలో మంత్రుల పర్యటన ఉండడంతో వారు హాజరయ్యే ప్రతి కార్యక్రమం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్ ద్వారా ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐటీ హబ్కు చేరుకొని రూ.36 కోట్లతో నిర్మించనున్న రెండోదశ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.
రూ.30 కోట్లతో ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో నిర్మించే సీసీ, బీటీ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మంత్రులు నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ నుంచి వీ.వెంకటాయపాలెం వరకు 4.4కిలో మీటర్ల నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులకు రూ.35 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యాధునిక హంగులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లిలో రూ.60.20 కోట్లతో నిర్మించిన 1,004 డబుల్ బెడ్రూం గృహ సముదాయాన్ని మంత్రి కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ప్రారంభించనున్నారు. టేకులపల్లిలో డబుల్బెడ్రూం గృహ లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్లను, ప్రాథమిక ఉప కూరగాయల మార్కెట్ను మంత్రులు సందర్శించి వాటిని ప్రారంభించనున్నారు. ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో ఖమ్మం బైపాస్ రోడ్లో రూ.25 కోట్లతో నిర్మించిన నూతన ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి కేటీఆర్ మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, ప్రశాంత్రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగిస్తారు.
మంచినీటి సరఫరా పథకం ప్రారంభం
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో మిషన్ భగీరథ పథకం కింద 45 వేల నూతన నల్లా కనెక్షన్లు, 85 వేల పాత నల్లా కనెక్షన్లకు రూ.229.95 కోట్లతో ప్రతిరోజూ మంచినీటి సరఫరా చేసే పథకాన్ని ప్రారంభించనున్నారు. మున్నేరు బ్రిడ్జి సమీపంలో కాల్వొడ్డు వద్ద రూ.2 కోట్లతో ఆధునీకరించిన వైకుంఠధామాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకుని హెలికాఫ్టర్లో సత్తుపల్లికి వెళ్తారు. సత్తుపల్లిలో రూ.3.11కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్కు శంకుస్థాపన చేస్తారు. సత్తుపల్లిలో జరిగే బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్తోపాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొంటారు.