మామిళ్లగూడెం, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు అండగా నిలుస్తున్నట్లుగానే మైనార్టీ వర్గాల సంక్షేమానికీ ప్రాధాన్యం ఇస్తున్నది. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారు. మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ‘విదేశీ విద్యానిధి పథకం’ ద్వారా రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. మసీదుల్లో మతబోధకులైన ఇమామ్లకు గౌరవ వేతనం అందిస్తున్నారు. రంజాన్ రోజుల్లో ముస్లిం ఉద్యోగులు నమాజ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అలాగే ఏటా రంజాన్ పండుగకు నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందిస్తున్నారు.
వచ్చే నెల 22న రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ తోఫా అందిస్తున్నది. ఖమ్మం నియోజకవర్గానికి 2,500 కిట్లు, మిగతా నాలుగు నియోజకవరాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,500 చొప్పున తోఫా కిట్లు జిల్లాకేంద్రానికి చేరుకున్నాయి. మైనార్టీశాఖ అధికారులు కిట్లను అక్కడి నుంచి మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలకు తరలించారు. ఇలా మొత్తంగా 8,500 కుంటుంబాలకు రంజాన్ తోఫా అందనున్నది. ప్రతి కిట్లో ఒక చీరె, ఒక జాకెట్, ఒక పంజాబ్ డ్రస్ మెటీరియల్, లాల్చీ, పైజామా మెటీరియల్ ఉంటుంది.
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు రోజా (ఉపవాసం) తర్వాత ఒక్క పొద్దులు విడుస్తారు. వారికి ఇఫ్తార్ విందు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నది. ఇలా జిల్లావ్యాప్తంగా 17 మజీద్లకు నిధులు మంజూరయ్యాయి. వీటిలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని 5 మసీద్లు, మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలోని మూడు మసీద్లకు రూ.లక్ష చొప్పున నిధులు అందాయి. ఈచొప్పున జిల్లావ్యాప్తంగా ఉన్న మసీదులకు రూ.17 లక్షల ఆర్థిక సాయం అందింది.
జిల్లాకు కేటాయించిన 8,500 రంజాన్ కిట్లు మండల కేంద్రాలకు చేరకున్నాయి. లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కిట్లు అందజేస్తారు. మజీద్ల పరిధిలో కమిటీలు ఏర్పడిన వారికి ఇఫ్తార్ విందుకు నిధులు అందిస్తున్నాం. వారం రోజులో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.
– మహమూద్,జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, ఖమ్మం