కేసీఆర్కు కృతజ్ఞతా సభలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డికి ఘన స్వాగతం
ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి: రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి
అన్నివర్గాలను ఏకతాటిపై నడిపించేందుకు కృషి: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
‘ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే దేశ ప్రజల సంక్షేమం సాధ్యం.. క్లిష్ట్ట పరిస్థితుల్లో దేశానికి ఆయన నాయకత్వమే శరణ్యం.. కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలను ఎండగట్టే ధాటి ఆయనకు మాత్రమే ఉంది.. కేంద్రంపై యుద్ధానికి ప్రతిఒక్కరూ సిద్ధం కావాలి.. అగ్నిపథ్ పథకాన్ని ఉప సంహరించేదాక పోరాటం చేయాలి.. కేసీఆర్ జిల్లాకు ప్రాధాన్యం ఇస్తున్నారు.. అందుకు జిల్లా నుంచి ఇద్దరు పారిశ్రామికవేత్తలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వడమే అందుకు నిదర్శనం.. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది సీట్లు సాధిస్తాం’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా శనివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షతన నిర్వహించిన ‘సీఎంకు కృతజ్ఞతా సభ’లో ఆయన మాట్లాడారు.. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ మరో పోరుకు సిద్ధమవుతుందన్నారు.
ఖమ్మం, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే దేశ ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి రాజ్యసభసభ్యులుగా ఎంపికైన తర్వాత తొలిసారి జిల్లాలో అడుగుపెడుతున్న సందర్భాన శనివారం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన ‘సీఎంకు కృతజ్ఞత సభ’లో ఆయన మాట్లాడారు. క్లిష్ట్ట పరిస్థితుల్లో దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని, కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలను ఎదుర్కొని ప్రజల అవసరాలు తీర్చే సామర్థం ఒక్క కేసీఆర్కే ఉందని ఉద్ఘాటించారు. దేశంలో యువత ప్రాణాలతో బీజేపీ చెలగాటం ఆడుతున్నదని ధ్వజమెత్తారు. సైనిక కొలువులను సైతం కాంట్రాక్టు ఉద్యోగాలుగా మార్చే కుట్రపూరిత వైఖరి అవలంబిస్తున్నదన్నారు. ఈ విధానాన్ని యువత వ్యతిరేకిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ మరో పోరుకు సిద్ధమవుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆ పథకాన్ని బేషరతుగా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీన బడుగు వర్గాలు, మైనారిటీలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 శాసనసభ స్థానాలను గెలిపించుకుని సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం రావడం అరుదైన అంశమన్నారు. దీనిబట్టి సీఎం కేసీఆర్ జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించాలన్నారు. ఈ ప్రాధాన్యతను పార్టీ శ్రేణులు, ప్రజలు పరిగణలోకి తీసుకొని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ముందుకు వెళ్లాలన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. సభకు అధ్యక్షత వహించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. పార్టీ అధినేత జిల్లాకు రాజకీయ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అందుకు రాజ్యసభ సభ్యులుగా బండి పార్థసారథిరెడ్డి ఎంపీనే నిదర్శమన్నారు. పార్టీ శ్రేణులు ఏకమైతే జిల్లాలో మరోపార్టీకి అవకాశమే లేదని వచ్చే ఎన్నికల్లో తేల్చిచెప్పాలని పిలుపునిచ్చారు. సభలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, పూల రవీందర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునకొల్లు నీరజ, ఉభయ జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు కొత్తూరు ఉమా మహేశ్వరరావు, దిండిగాల రాజేందర్, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరారావు పాల్గొన్నారు.
పదవుల కేటాయింపులో జిల్లాకు ప్రాధాన్యం : ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాకు రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. జిల్లాను ప్రత్యేక దృష్టితో చూస్తూ అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారని కొనియాడారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సశ్యశ్యామలం కానున్నదన్నారు. రాజకీయ పదవుల్లోనూ జిల్లాకు ప్రాధాన్యం లభించిందన్నారు. రాష్ట్రంలో ఏడు రాజ్యసభ సీట్లు ఉండగా వాటిలో జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం వచ్చిందన్నారు. ఈ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని ప్రతి కార్యకర్త అర్థం చేసుకొని సైనికుడిలా ఎన్నికల కదన రంగంలోకి దూకాలని పిలుపునిచ్చారు. రానున్న సాధారణ ఎన్నికల్లో పదికి పది సీట్లు సాధించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చూపిస్తున్న వివక్షపై పోరు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి బండి పార్థసారథిరెడ్డి ఉద్యమ అవసరాలను తీరుస్తూ వచ్చి ఉద్యమ నేత కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం దేశంలో చిచ్చు రేపుతున్నదన్నారు. యువకులను అభద్రతా భావంలోకి నెట్టి చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు.
కేంద్రానివి అనాలోచిన నిర్ణయాలు : ఎంపీ నామా
టీర్ఎస్ లోక్సభా పక్షనేత ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దేశ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్ట గలిగే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉందన్నారు. ఇప్పటికే కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రైతులు తీవ్ర అగచాట్లకు గురయ్యారన్నారు. సీఎం కేసీఆర్ జిల్లాకు రెండు రాజ్యసభ సీట్లు ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ పాలనలో జిల్లా అభివృద్ధికి రూ.50 వేల కోట్ల కేటాయింపు జరిగిందన్నారు.
బీసీల గొంతుకనై పనిచేస్తా.. : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. బీసీల గొంతుకగా నిలబడి వారికి అండగా నిలుస్తానన్నారు. బీసీ ప్రజాప్రతినిధిగా అన్ని సామాజిక వర్గాలను సమన్వయం చేసి ముందుకు వెళ్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. సీఎం, పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో పని చేసి జిల్లాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
అభివృద్ధిలో భాగస్వామినవుతా.. : రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి
రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్తో కలిసి రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామినవుతానన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశాన్నే ఆకర్షిస్తున్నాయన్నారు. అనేక దేశాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని, ఒక పారిశ్రామికవేత్తగా మన రాష్ట్రం అంతటి ఘనకీర్తిని అందుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. ప్రజల కష్టాలు తెలిసినవాడిగా వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు.
రాజ్యసభ సభ్యులకు గజమాలతో సత్కారం
అభినందన సభకు హాజరైన అశేష జనవాహిని
రానున్న ఎన్నికల్లో పదికి పది స్థానాలూ టీఆర్ఎస్ గెలవాలి
‘సీఎం కేసీఆర్కు కృతజ్ఞత’ సభలో వక్తల పిలుపు
ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డిలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా శనివారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన ‘సీఎంకు కృతజ్ఞతా సభ’ విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అశేష జనవాహిని తరలివచ్చింది. టీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మున్నూరు కాపుపు వేల సంఖ్యలో తరలిరావడంతో ఖమ్మం వీధులన్నీ గులాబీమయమయ్యాయి. ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రసంగించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ తరపున 7 రాజ్యసభ స్థానాలు ఉండగా ఖమ్మం జిల్లాకు రెండు స్థానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించడం ఖమ్మం జిల్లాపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. వద్దిరాజు రవిచంద్రకు, బండి పార్థసారథి రెడ్డిలకు అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ తరపున ఒక్కొక్కరే ఎమ్మెల్యేలుగా గెలుపొందారని అన్నారు. కానీ రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది స్థానాలనూ గెలిపించి సీఎం కేసీఆర్కు అందించాలని పిలుపునిచ్చారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన బండి పార్థసారథిరెడ్డి 2001 నుంచి కేసీఆర్కు, కేటీఆర్కు అండదండగా ఉన్నారన్నారు. గాయత్రి రవి గ్రానైట్ పరిశ్రమను నెలకొల్పి సేవా దృక్పథంలో వేలమంది ప్రజలకు అనేక సహాయ సహకారాలు అందిస్తున్నాని అన్నారు. పెద్దల సభకు వెళ్లేందుకు వారిద్దరికీ అవకాశం కల్పించడం ఎంతో సంతోషకరమని అన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు.
జిల్లాకు అత్యున్నత గౌరవం: ఎమ్మెల్సీ తాతా మధు
ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ అత్యున్నత గౌరవాన్ని ఇవ్వడం జిల్లా ప్రజల అదృష్టమని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చరిత్రలో ఏ పార్టీ కూడా రెండు రాజ్యసభ స్థానాలను ఒకే జిల్లాకు ఇవ్వలేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ వెంట ఉంటూ దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ సభకు హాజరైన అశేష జనవాహినిని బట్టి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై ఉన్న ప్రేమ కన్పిస్తోందని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చాలి: ఎమ్మెల్యే సండ్ర
జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు సీఎం కేసీఆర్లకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాంక్షించారు. తెలంగాణ పట్ల కేంద్ర అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించే క్రమంలో జిల్లా ఎంపీలు అగ్రభాగాన నిలవాలన్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ వల్ల తీవ్ర నష్టం జరుగుతున్నదన్నారు. దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ప్రాణాలు పొతున్న ప్రజలను కాపాడిన బండి పార్థసారథిరెడ్డి, నిత్యం ప్రజలకు అండగా ఉంటూ సేవలందిస్తున్న వద్దిరాజు రవిచంద్రలు ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించాలని ఆకాంక్షించారు.
జిల్లాపై నమ్మకంతోనే రెండు స్థానాలు: ప్రభుత్వ విప్ రేగా
ఖమ్మంపై ఉన్న నమ్మకంతోనే సీంఎ కేసీఆర్ జిల్లాకు రెండు రాజ్యసభ స్థానాలను కేటాయించారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ స్థానాలు ఇచ్చి సీఎం కేసీఆర్ కొత్త చరిత్రకు నాంది పలికారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి రాజ్యసభ పంపడం గర్వకారణమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పదవి ఇవ్వడంతో కావులపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ముగ్గురు ఎంపీలు కీలకపాత్ర పోషించాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి కోరారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లోనూ టీఆర్ఎస్ను గెలిపించి రాజకీయాలను మలుపు తిప్పాలని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు కోరారు.
సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం: మాజీ మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం కల్పించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అండదండలతో జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుననట్లు వివరించారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను సంతోష పెట్టలేకపోయమన్నారు. అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించిందని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్న నేపథ్యంలో ముగుర్గు ఎంపీలపై మరిన్ని బాధ్యతలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్యేలు మదన్లాల్, చంద్రావతి, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఆర్ఎస్వై జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, బలుసు మురళీకృష్ణ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కమర్తపు మురళి, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య, జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, చిత్తారు సింహాద్రియాదవ్, బొమ్మర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సర్వమతాల దీవెనలు..
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డిలను హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలతో ఆశీర్వదించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గాయత్రి రవిని ఘనంగా సన్మానించారు. పటేల్ స్టేడియం మొత్తం పటాకులతో మార్మోగింది. విద్యుత్కాంతులతో ఏర్పాటు చేసిన ‘జై కేసీఆర్.. దేశ్కీ నేత కేసీఆర్’, ‘జై కేటీఆర్.. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్’ పేర్లు సభికులకు ఆకట్టుకున్నాయి.