పేదింట ఆడపిల్ల పెండ్లి చేయాలంటే తల్లిదండ్రులకు తెలియని ఆందోళన. అప్పో సప్పో చేసి మెట్టినింటికి పంపించాలనే ఆలోచన. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల పెండ్లి చేస్తే భారం తగ్గుతుందనే భావన. కానీ ఇప్పుడు పేదింట కల్యాణ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆడబిడ్డ లగ్గానికి తెలంగాణ సర్కార్ బాసటగా నిలుస్తున్నది. ఆడపిల్లల వివాహానికి సీఎం కేసీఆర్ మేనమామలా కానుక అందిస్తున్నారు. పేదింట పెద్దన్నలా భరోసా కల్పిస్తూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చారు. తొలినాళ్లలో ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుకు రూ.51 వేలు అందేది. 2017 మార్చి 13న సీఎం కేసీఆర్ ఆ సొమ్మును రూ.75,116కు పెంచారు. తిరిగి ఆ సొమ్ముకు రూ.66 వేలు పెంచి 1 ఏప్రిల్ 2018లో రూ.1,00,116గా ప్రకటించారు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు. దీంతో వారు ఆడపిల్లల వివాహాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. పెండ్లికి చేసిన అప్పులు తీర్చుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఆయన వెంటే నడుస్తామని శపథం చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా 40,960 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.380.37 కోట్లు జమయ్యాయి.
ఖమ్మం, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆడబిడ్డ పుట్టిందంటే చాలు తల్లిదండ్రులు ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందనుకుంటారు. గజ్జెల సవ్వడితో ఇంట్లో నడయాడుతుంటే ఆ ఇంటికే కళ వచ్చినట్లు భావిస్తారు. ఆ బిడ్డను మురిపెంగా పెంచి పెద్దదాన్ని చేస్తారు. మంచి వరుడిని వెతికి లక్షణంగా పెండ్లి చేయాలని కోరుకుంటారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులను పిలిచి విందు భోజనం పెట్టాలనుకుంటారు. గౌరవప్రదంగా ఆమెను అత్తారింటికి పంపాలనుకుంటారు. నలుగురిని పిలిచి భోజనం పెట్టాలన్నా, పెండ్లి సామగ్రి కొనాలన్నా, షామియానాలు ఏర్పాటు చేయాలన్నా ఈ రోజుల్లో ఖర్చుతో కూడుకున్న పని. అలాగే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలూ అమాంతం పెరిగిపోయాయి. వెనుకబడిన కుటుంబాలకు ఆ ఖర్చులు ఆర్థిక భారం. అలాంటి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహానికి కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. మేనమామగా ‘కల్యాణలక్ష్మి’ కానుక అందజేస్తున్నారు.
సొమ్ము పెంపు ఇలా..
ఆడపిల్లకు పెండ్లి కుదిరిందంటే చాలు. తల్లిదండ్రులు ఇక ఆర్థిక వనరుల గురించి ఆలోచిస్తారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అప్పు చేసైనా సరే తమ కుమార్తెకు పెండ్లి చేయాలనుకుంటారు. కొందరు గత్యంతరం లేక అధిక వడ్డీలకు సొమ్ము తెస్తారు. ఎలాగో కుమార్తె వివాహం చేస్తారు. ఆ తర్వాత అష్టకష్టాలు పడి అప్పు తీరుస్తారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి సొమ్మును క్రమంగా పెంచుతూ వచ్చారు. 2 అక్టోబర్ 2014న సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా పథకాన్ని ప్రారంభించారు. తొలినాళ్లలో పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుకు రూ.51 వేలు అందేది. 2017 మార్చి 13న సీఎం కేసీఆర్ ఆ సొమ్మును రూ.75, 116కు పెంచారు. తిరిగి ఆ సొమ్మును రూ.66 వేలు పెంచి 1 ఏప్రిల్ 2018లో రూ.1,00,116గా ప్రకటించి అమలు చేస్తున్నారు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా అమలు ఇలా..
ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో 2016-17 నుంచి ఇప్పటివరకు 34,767 మంది దరఖాస్తు చేసుకోగా 30,629 మంది లబ్ధిదారుల్లో ఖాతాల్లో రూ.287.60 కోట్లు జమయ్యాయి. కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 2016-17 నుంచి ఇప్పటివరకు 11,189 మంది దరఖాస్తు చేసుకోగా 10,331 మంది లబ్ధిదారుల్లో ఖాతాల్లో రూ.92.కోట్లు జమయ్యాయి. ఇలా మొత్తం జిల్లావ్యాప్తంగా 40,960 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.380.37 కోట్లు జమయ్యాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా అందిన సొమ్ముతో ఆడపిల్లల పెండ్లి చేశామని, పెండ్లికి చేసిన అప్పులు తీర్చామని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
నిబంధనల సడలింపు..
గతంలో ఒక కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష దాటితే వారిని నిరుపేదలుగా గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించేవారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి వర్తింపునకు కొన్ని నిబంధనలను సడలించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఉంటే వారిని నిరుపేదలుగా గుర్తించాలని నిర్ణయించింది. దీంతో పథకం ద్వారా మరికొంతమందికి లబ్ధి చేకూరింది.
పెళ్లి అప్పులు తీర్చాం..
అప్పు చేసి మా అమ్మాయికి గతేడాది పెండ్లి చేశాం. తర్వాత అప్పు ఇచ్చిన వాళ్లు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. కల్యాణలక్ష్మి గురించి తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకున్నాం. కొద్దిరోజుల్లోనే రూ. 1,00116 చెక్కు వచ్చింది. అందిన సొమ్ముతో అప్పులు తీర్చాం. సీఎం కేసీఆర్ పేదల కష్టాలు తెలిసి ఆడబిడ్డల వివాహానికి సాయం అందిస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతలు.
– రామిశెట్టి లక్ష్మి, లబ్ధిదారు, టేకులపల్లి, భద్రాద్రి జిల్లా
సీఎం కేసీఆర్ పెద్దదిక్కయ్యారు..
బంధువుల దగ్గర అప్పు చేసి మా అమ్మాయి పెళ్లి చేశాం. గౌరవప్రదంగా అత్తవారింటికి పంపాం. ప్రభుత్వం ఇచ్చిన కల్యాణలక్ష్మి నగదుతో తిరిగి అప్పు తీర్చాం. కష్టకాలంలో సీఎం కేసీఆర్ పెద్ద దిక్కు అయి పెళ్లికి సాయం చేశారు. మాలాంటి ఎన్నో నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి భరోసానిస్తున్నది. కేసీఆర్ పెద్ద మనసు ఎన్నో కుటుంబాలను ఆదుకుంటున్నది.
– బన్న పద్మ, లబ్ధిదారు, రుద్రంపూర్, భద్రాద్రి జిల్లా
మా ఇంటి పెద్దన్న కేసీఆర్..
మా ఇంటి పెద్దన్న కేసీఆర్. కల్యాణలక్ష్మి పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేసింది. మా కుమార్తె స్నేహ పెండ్లిని గౌరవప్రదంగా చేశాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నాయి. రైతుబంధు, రైతుబీమాతో రైతులకు మేలు జరుగుతున్నది.
– ఏలూరి వాణికుమారి, లబ్ధిదారు, వైరా, ఖమ్మం జిల్లా
పేదింటి ఆడపిల్లలకు వరం..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదింటి ఆడపిల్లలకు వరం. మా కుమార్తె సాయి ప్రత్యూష పెండ్లి చేశాం. పథకం ద్వారా వచ్చిన డబ్బులు మా కుటుంబాన్ని ఆదుకున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్కు నిరుపేదలు ఎంతో రుణపడి ఉంటారు.
– దారా శ్రీనివాసరావు, లబ్ధిదారు, వైరా, ఖమ్మం జిల్లా..