భద్రాచలం, అక్టోబర్ 9: బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భద్రాచలంలో సోమవారం పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా బ్రిడ్జి సెంటర్కు చేరుకున్న ఆయనకు భద్రాచలం బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకూ బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గాను భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి ఆవిష్కరించారు.
అలాగే భద్రాచలంలో రూ.2.60 కోట్లతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులకు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.1.10 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కూనవరం రోడ్డులో రూ.38 కోట్లతో నిర్మించనున్న కరకట్ట విస్తరణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఆ తరువాత ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రూ.21.50 లక్షలతో నిర్మించిన కిచెన్ కాంప్లెక్స్, సీసీ రోడ్లు, ఆప్తాలమిక్ వింగ్, బ్లడ్బ్యాంక్, మార్చురీ రూం ఆధునీకరణ పనులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ప్రజలకూ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
ప్రజల కోసం ప్రతిపక్షాలు చేసింది ఏమీ లేదని విమర్శించారు. అందుకే వారిని ఓట్లు అడిగేందుకు ప్రతిపక్షాలు భయపడుతున్నాయని అన్నారు. భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్, అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మంగీలాల్, నాగలక్ష్మి, శ్రీనివాస్యాదవ్, తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, చింతాడి చిట్టిబాబు, రామకృష్ణ, రత్నం రమాకాంత్, రజనీకాంత్, బొంబోతుల రాజీవ్, తిప్పన సిద్ధులు, తాళ్ల రవికుమార్, కోటగిరి ప్రభోద్కుమార్, శ్వేత, ఎండీ ముంతాజ్, సీతామహలక్ష్మి, కేతినేని లలిత, మానె కమల, ఒగ్గు అనురాధ పాల్గొన్నారు.