ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 24 : నాణ్యమైన విద్యను అభ్యసించాలంటే గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. పాఠశాల విద్య అయినా, ఇంటర్మీడియట్, డిగ్రీ సాంకేతిక కోర్సులు ఏవైనా రాజధాని బాట పట్టాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం విద్యారంగంలో రాణించేందుకు, ఇక్కడి విద్యాసంస్థల్లో చదివించేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంతో చైతన్యవంతమైనది ఉమ్మడి ఖమ్మం జిల్లా కావడంతో విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులతో హైదరాబాద్ తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంతో కేజీ టూ పీజీ వరకు అన్ని కోర్సుల్లో ఉమ్మడి జిల్లాలోని విద్యారంగం దూసుకుపోతోంది. ఎంట్రన్స్లేవైనా.. ఫలితాలు మాత్రం మావే అనేలా ఉమ్మడి జిల్లా విద్యార్థులు రాణిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతి ఫలితాల్లో టెన్త్ జీపీఏల సాధనలో, ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్టేట్ ప్రథమ ర్యాంక్లు సాధించి జిల్లా ఖ్యాతిని చాటుతున్నారు. ఎంసెట్, జేఈఈ, నీట్ విభాగాల్లో అత్యుత్తమ ర్యాంక్లతో మనోళ్లు మెరిశారు. ఫలితాలు ఏవైనా ర్యాంక్లు మావే అనేలా విజయఢంకా మోగిస్తున్నారు. అన్నింటా సత్తా చాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యా పరిమళాలను రాష్ట్రం నలుదిక్కులా వ్యాపింపజేశారు. ఎడ్యుకేషన్ హబ్గా హైదరాబాద్ తర్వాత ఉమ్మడి ఖమ్మానికి పేరుంది. ఆ పేరును ఎప్పటికప్పుడు విద్యార్థులు నిలుపుతూనే వస్తున్నారు.
జిల్లాల విభజన అనంతరం ఎడ్యుకేషన్ పరంగా రెండు జిల్లాలు ఇంకా ఉత్తమ ఫలితాలను నమోదు చేస్తున్నాయి. స్కూల్ స్థాయిలో, ఇంటర్లో, డిగ్రీ, ఇంజినీరింగ్లోనూ అదే స్థాయిని కొనసాగించింది. ఇటీవల నమోదవుతున్న ఫలితాలతో ఆశించిన స్థాయిలో విజయభేరి మోగించిన విద్యార్థులు, విద్యాసంస్థలు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాయి. గతంలో జిల్లా విద్యార్థులు విజయవాడ, హైదరాబాద్లోని కార్పొరేట్ కళాశాలల్లో చదివేవారు. ఇటీవల వస్తున్న ఫలితాలతో కార్పొరేట్ స్థాయి ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే నమోదు చేస్తున్నారు. టాప్ టెన్లో జిల్లా విద్యార్థులు తప్పనిసరిగా ప్రభావం చూపుతూనే ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి జిల్లాలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య నమోదవుతున్నది. స్కూల్స్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తుండడం, సాధారణ విద్యాసంస్థల నుంచి కార్పొరేట్ తరహా, యూనివర్సిటీ స్థాయిలో వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీపడకుండా నిర్వహణ సాగుతుండడం ఉమ్మడి జిల్లా విద్యాసంస్థల ప్రత్యేకత. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు విద్యా ప్రగతికి సూచికలు.