భద్రాచలం, మార్చి 10 : గిరిజనులు తమ సమస్యలపై సమర్పించిన అర్జీల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో పీవో దరఖాస్తులు స్వీకరించారు. తన పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించి, మిగిలిన వాటిని సంబంధిత శాఖ అధికారులకు పరిష్కారం కోసం పంపించారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు, పట్టా భూములకు రైతుబంధు, జీవనోపాధి పెంపొందించేందుకు ఆర్థిక సాయం, ట్రైకార్ సబ్సిడీ రుణాలు తదితర అంశాలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న గిరిజనులకు విడతలవారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ చంద్రశేఖర్, ఏవో సున్నం రాంబాబు, ఎస్వో భాస్కరన్, ఏపీవో పవర్ వేణు, ఆర్వోఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, డీఎస్వో ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.