భద్రాచలం, ఏప్రిల్ 3: ఆదివాసీ గిరిజనుల జీవనోపాధి పెంపొందించడానికి ఐటీడీఏలోని అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. గ్రూప్-1 శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన వారితో భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐటీడీఏ ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి క్లుప్తంగా వివరించారు.
ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో 35 వేల మంది విద్యనభ్యసిస్తున్నారని, వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలో 15 మంది పాల్గొని పతకాలు సాధించారని పీవో తెలిపారు. ఉద్దీపకం వర్క్బుక్ను తీసుకొచ్చి ప్రాథమిక స్థాయి విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో 95 శాతం ఉత్తీర్ణత సాధించామని, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ద్వారా వివిధ శాఖల అధికారులతో అవగాహన కల్పించడం వల్ల విద్యార్థులలో చాలా వరకు మార్పు వచ్చిందన్నారు. 1970 కంటే ముందు నుంచి సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పోడు పట్టాలు అందజేశామని పేర్కొన్నారు.
అనంతరం గ్రూప్-1 శిక్షణ సభ్యుల బృందం ఏరియా ఆస్పత్రిని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆస్పత్రి పర్యవేక్షకుడు రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని సందర్శించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకులకు, నీట్, జేఈఈ, గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే దానిపై సలహాలు సూచనలు అందించారు. డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, మధుకర్, ఆర్సీవో గురుకులం అరుణకుమారి, ఉద్యానవన అధికారి ఉదయ్కుమార్, ఏపీవో పవర్ వేణు, ఏవో రాంబాబు, డీఎం జీసీసీ సమ్మయ్య, ఏటీడీవో చంద్రమోహన్, జేడీఎం హరికృష్ణ, డీఎస్వో ప్రభాకర్రావు పాల్గొన్నారు.