ఏజీహెచ్ఎస్ తనిఖీలో ఐటీడీఏ పీవో రాహుల్
ఇల్లెందు, ఫిబ్రవరి 28 : గిరిజన సంక్షేమ శాఖలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్య బలోపేతానికి పకడ్బందీ చర్యలతోపాటు పలు సంస్కరణలు చేపట్టినట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. ఇల్లెందు పట్టణంలోని ఏజీహెచ్ఎస్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఉద్దీపకం వర్క్బుక్లోని పలు అంశాలు, అక్షరమాల, అధికారుల పేర్లను పిల్లల చేత బోర్డుపై రాయించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ పై చదువులకు వెళ్లడానికి పదో తరగతి తొలిమెట్టు అని, ఇప్పుడు కష్టపడి అత్యధిక మార్కులు సాధిస్తేనే ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.
వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులను ఇళ్లకు పంపొద్దని, డ్రాపవుట్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని పాఠశాలలకు రప్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని ఆదేశించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.