భద్రాచలం, మే 27 : మీరు సాధించిన అత్యుత్తమ మార్కులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతస్థాయి చదువుల్లో జైత్రయాత్ర కొనసాగించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు చదివి అత్యుత్తమ మారులు సాధించిన విద్యార్థులను భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం సన్మానించారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో చదివి, మంచి మార్కులు సాధించి రాష్ట్రంలోనే జిల్లాకు పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు ఎంసెట్, నీట్, జేఈఈ, ఇతర గ్రూప్స్ రాయడానికి ఎంతో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ చదివిన పిల్లలు బీటెక్, ఎంబీబీఎస్ కోర్సులు చేయడానికి ఉపకరిస్తాయన్నారు. 550 మార్కులకు పైగా సాధించిన వారితోపాటు జేఈఈ మెయిన్స్లో విజయం సాధించిన ఐదుగురు, ఎప్సెట్లో ఇంజినీరింగ్ సీట్లు సాధించిన నలుగురిని ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఆర్సీవో గురుకులం అరుణకుమారి, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అశోక్, విజయలక్ష్మి, ఏసీఎంవోలు రమేశ్, రాములు, ఏటీడీవో చంద్రమోహన్, భారతీదేవి, క్రీడల అధికారి గోపాలరావు, ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు పాల్గొన్నారు.