సారపాక, మార్చి 23 : పారిశ్రామిక ప్రాంతమైన సారపాక పంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐటీడీఏ పీవో, పంచాయతీ ప్రత్యేకాధికారి ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం సారపాకలో పంచాయతీ కార్యాలయం, డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డుల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుల్లో వేసేలా చూడాలన్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి సారపాక మీదుగా వేలాదిగా భక్తులు వస్తుంటారని, ఈ నేపథ్యంలో పంచాయతీ పరిధిలో ఎక్కడ కూడా చెత్తాచెదారం కనిపించొద్దన్నారు. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు సరిపోకపోతే కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈవోను ఆదేశించారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
పల్లెప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వార్డుల్లో డ్రైనేజీలను శుభ్రం చేయాలని, దోమలు వ్యాప్తిచెందకుండా ఫాగింగ్ చేయించాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా నర్సరీ, పల్లెప్రకృతి వనాల్లో మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈవో కంది మహేశ్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.