భద్రాచలం, ఫిబ్రవరి 16: గిరిజనులు తమ సమస్యలపై సమర్పించిన అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత శాఖల యూనిట్ అధికారులను ఆదేశించారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ ఆఫీసర్ల సమక్షంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి గిరిజనులు అర్జీలు సమర్పించారు. వాటిని స్వీకరించిన పీవో.. తన పరిధిలోని వాటిని పరిష్కరించి, మిగిలిన వాటిని ఆయా శాఖల అధికారులకు పంపించారు.
అనంతరం పీవో మాట్లాడుతూ ఎకువ శాతం అర్జీలు పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, ట్రైకార్ రుణాలు, పట్టా భూములకు విద్యుత్ సౌకర్యం, జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాలు తదితరాలపై వినతులు వచ్చినట్లు తెలిపారు. గిరిజన దర్బార్లో గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, విడతలవారీగా వారి సమస్యలు పరిషరించడానికి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఏవో సున్నం రాంబాబు, ఏపీవో పవర్ వేణు, డీటీఆర్వోఎఫ్ఆర్ లక్ష్మీనారాయణ, హెచ్ఎన్టీసీ ఉదయ్కుమార్, ఎల్టీఆర్ డీటీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సమయపాలన పాటించాలి : పీవో
ఐటీడీఏ కార్యాలయంలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న యూనిట్ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసే మిషన్ను పీవో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనిట్ అధికారులు, సిబ్బంది ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు తప్పక నమోదు చేయించుకోవాలని సూచించారు. హాజరు నమోదు చేయించుకోని వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఏవో సున్నం రాంబాబు, ఏపీవో పవర్ వేణు, మేనేజర్ ఆదినారాయణ సిబ్బంది రాజేశ్, రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.