దమ్మపేట రూరల్, ఏప్రిల్ 14 : వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా ఉందని మట్టుపెట్టాలనుకున్నాడు. చీరె కొంగుతో ఉరి వేసి హతమార్చి గుండెపోటుతో మృతిచెందిందని అందర్నీ నమ్మించాలనుకున్నాడు. కానీ నేరం ఎంతోకాలం దాగదు కదా.. దమ్మపేట పోలీసులు అనతికాలంలోనే ఆ కేసును ఛేదించారు. నిందితుడు భర్తేనని నిర్ధారించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో శుక్రవారం అశ్వారావుపేట సీఐ బమ్మెర బాలకృష్ణ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన మౌనిక (29)కు 2010లో భద్రాద్రి జిల్లా దమ్మపేట మండల పరిధిలోని వడ్లగూడేనికి చల్లా నాగేంద్రబాబుతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె. అప్పటి నుంచి ఆడబిడ్డ పుట్టిందని, తనకు మగబిడ్డ కావాలని నాగేంద్రబాబు భార్యను దూషించేవాడు. అదనపు కట్నం కావాలని వేధించేవాడు. కొంతకాలం నుంచి నాగేంద్రబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడు.
ఈ విషయంపై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాగేంద్రబాబు భార్య అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. ఈ నెల 10వ తేదీ రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య మెడకు చీరె బిగించి భర్త హతమార్చాడు. తెల్లవారుజామున ఇరుగు పొరుగు వారు అడిగినప్పుడు తన భార్య గుండెపోటుతో మృతిచెందిందని నమ్మబలికాడు. మౌనిక మృతదేహంపై గాయాలను గుర్తించిన ఆమె తల్లిదండ్రులు భర్తే హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. తమదైన శైలిలో విచారించగా తానే మౌనికను హత్య చేసినట్లు భర్త నేరాన్ని అంగీకరించాడు. నిందితుడితో పాటు హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలు లేకుండా చేసేందుకు యత్నించిన అతడి తండ్రి చెన్నారావు, సోదరుడు దిలీప్పైనా కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై శ్రావణ్ పాల్గొన్నారు.