నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ కల సాకారం అవుతున్నది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంతో జల వనరులకు ఢోకాలేకుండా పోయింది. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపు పారదర్శకంగా జరుగుతున్నది. ఇక ఉద్యోగాల ప్రక్రియ విషయంలో టీఎస్పీఎస్సీ ద్వారా పకడ్బందీగా చేపడుతున్నది. లంచాల్లేవు.. పైరవీల్లేవు.. నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతిభకు పట్టం కడుతున్నది. నియామకాలకు నిఖార్సైన రూపంగా నిలుస్తున్నది. రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతున్నది. తెలంగాణ ఏర్పాటు నుంచి వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తూ వస్తున్నది. ఇప్పటికే లక్షలాది ఉద్యోగులతో నిరుద్యోగులకు భరోసా కల్పించింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 35వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. నోటిఫికేషన్ వచ్చింది మొదలు ఫలితాలు ప్రకటించే వరకు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. దీంతో పేద, మధ్యతరగతి, కూలినాలీ చేసుకునేవారు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో టీఎస్పీఎస్సీ నియామక ప్రక్రియలో ఉద్యోగాలు సాధించారు. ఆనందంగా కొలువులు చేస్తున్నారు. అయితే, వ్యక్తులు చేసిన తప్పును వ్యవస్థకు ఆపాదించడం.. కమిషన్పై నిందలు వేయడం సరికాదని ఉద్యోగాలు సాధించినవారు పేర్కొంటున్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు కొన్ని పార్టీలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడుతున్నారు. ఉద్యోగార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని మనోధైర్యం కల్పిస్తున్నారు. నిరుత్సాహ పడొద్దని, ఆత్మవిశ్వాసంతో కొలువులకు సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 20: ప్రతిభనే నమ్ముకున్నారు.. రేయింవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టారు.. సిలబస్ను ఔపోసన పట్టారు.. పరీక్షలు రాశారు.. మెరిట్ సాధించారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా కొలువుదీరారు.. కొందరు ఉన్నతాధికారుల స్థాయికి ఎదిగారు.. టీఎస్పీఎస్సీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడంతోనే ప్రతిభావంతులను కొలువులు వరించాయని వేరే చెప్పనక్కర్లేదు. ఉమ్మడి పాలనలో నాటి ఏపీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా ఉండి అర్హతలేని వాళ్లు సభ్యులయ్యారు. ఆ వ్యవస్థకు చైర్మన్లయ్యారు. నాడు పైరవీలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఏపీపీఎస్సీ నిలిచింది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ నాయకుడు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి టీఎస్పీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు టీఎస్పీఎస్సీ సభ్యుల సహకారంతో వ్యవస్థలో ఎన్నో సంస్కరణలను అమలు చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను తీసుకొచ్చారు. ఏఈవో, పంచాయతీ కార్యదర్శి, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అసిస్టెంట్ ఇంజినీర్, గ్రూప్-2, 4 పరీక్షలను నిర్వహించారు. మెరిట్ సాధించిన వేలాది మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చారు. పరీక్షల నిర్వహణపై వారి విలువైన అభిప్రాయాలను ‘నమస్తే’తో పంచుకున్నారు. వివరాలు వారి మాటల్లోనే..
మా స్వగ్రామం బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం. ప్రాథమిక విద్య నుంచి పదోతరగతి వరకు మా ఊరిలోనే చదువు. ఇంటర్మీడియట్ పాల్వంచ, డిగ్రీ కొత్తగూడెంలోని ప్రైవేటు కళాశాలల్లో చదివాను. నాకు పోటీ పరీక్షలపై ఆసక్తి ఉందని గమనించిన నాన్న నన్ను హైదరాబాద్ పంపించారు. ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్లో నేను పోటీపరీక్షలకు శిక్షణ పొందాను. తొలుత పంచాయతీ కార్యదర్శి కొలువు సాధించా. 2019లో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-4కు దరఖాస్తు చేసుకున్నా. 2021లో పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మెరిట్ లిస్ట్లో నా పేరు ఉంది. కొత్తగూడెం బెటాలియన్లో జూనియర్ అసిస్టెంట్గా నాకు పోస్టింగ్ వచ్చింది. నాకు ఉద్యోగం రావడానికి మొదటి కారణం నన్ను ప్రోత్సహించిన నాన్న అయితే.. రెండో కారణం పరీక్షలను పారదర్శకంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీ. బయట మాటలు పట్టించుకోకుండా అభ్యర్థులు పోటీపరీక్షలకు సిద్ధం కావాలి. మెరిట్ సాధిస్తే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
– పొందూరి రాము, పోలీస్ బెటాలియన్ జూనియర్ అసిస్టెంట్, కొత్తగూడెం
మాది అశ్వారావుపేట. సాధారణ కుటుంబ నేపథ్యం. నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. నా స్కూలింగ్ అంతా అశ్వారావుపేటలోనే. నేను అశ్వారావుపేటలోనే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పూర్తి చేశా. అనంతరం గ్రూప్-1, 2, 3 పరీక్షలకు సిద్ధం కావాలనుకున్నా. ఇంటి దగ్గరే చదివా. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేదు. 2016లో టీఎస్పీఎస్సీ ఏఈవో పోస్ట్ల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నా. 2017లో ఫలితాలు వచ్చాయి. ఇదే ఏడాది జనవరి 31న అశ్వారావుపేట మండలం నారాయణపురం క్లస్టర్ ఏఈవోగా పోస్టింగ్ అందుకున్నాను. నా ప్రతిభతో కొలువు సాధించాను. పరీక్ష పారదర్శకంగా జరిగింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెరిట్ పరిశీలన తర్వాతే నాకు పోస్టింగ్ వచ్చింది. ఉద్యోగం సాధించడంతో అమ్మానాన్న ఎంతో ఆనందపడ్డారు. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది.
– షకీరాబాను, ఏఈవో, నారాయణపురం క్లస్టర్, అశ్వారావుపేట మండలం
మా స్వస్థలం ఖమ్మం. మాది అత్యంత నిరుపేద కుటుంబం. ప్రాథమిక విద్య నుంచి కాలేజీ వరకు చదువంతా ఖమ్మం నగరంలోనే సాగింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నేను చదివాను. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లోనే నాకు వివాహమైంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవ్వాలనుకున్నా. నా భర్త నన్నెంతగానో ప్రోత్సహించారు. కేజీబీవీలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగం చేసుకుంటూనే పోటీపరీక్షలకు సిద్ధమయ్యా. 2010లో నాకు బాబు పుట్టాడు. కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ చదువును పక్కనపెట్టలేదు. 2017లో టీఎస్పీఎస్సీ విడుదల చేసి గురుకుల టీచర్స్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నా. ఇదే ఏడాది పరీక్ష రాశా. మంచి మార్కులు సాధించి 2018లో ఖమ్మంలోని తిరుమలాయపాలెం గురుకుల పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా కొలువు సాధించా. టీఎస్పీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయి. అభ్యర్థులు వారి కష్టాన్నే నమ్ముకొని చదవాలి. మెరిట్ ఉన్న వారికే ఉద్యోగాలు వస్తాయి. చిల్లర మల్లర ఘటనలను పట్టించుకోవద్దు.
– మేక శ్రీదేవి, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, తిరుమలాయపాలెం
మా స్వస్థలం మంచిర్యాల. నాన్న సింగరేణి ఉద్యోగి. నేను నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను. చదువుతో పాటు టైపింగ్ హయ్యర్ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. ఒకవైపు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే మంచిర్యాల ఎంపీడీవో కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో టైపిస్ట్గా పనిచేశా. ఇదే క్రమంలో స్వరాష్ట్రం వచ్చింది. టీఎస్పీఎస్సీ ప్రభుత్వ కొలువుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయడం ప్రారంభించింది. పోటీ పరీక్షలకు సొంతంగా మెటీరియల్ సమకూర్చుకున్నాను. ఇంట్లో ఉండే చదవడం ప్రారంభించాను. 2018లో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకుని ఇదే ఏడాది పరీక్ష రాశాను. ఫలితాల్లో మంచి మెరిట్ సాధించాను. 2021లో కరీంనగర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. నాకు డిగ్రీతో పాటు టైపింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండడంతో టైపిస్ట్ పోస్ట్కు ఎంపికయ్యాను. మా జిల్లా పరిధిలో నాడు టైపిస్ట్ పోస్ట్లు ఖాళీగా లేకపోడంతో నాకు భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం బోనకల్ తహసీల్దారు కార్యాలయంలో టైపిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నా. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరిగింది. నాలా ప్రతిభ ఉన్నవారెందరో ప్రభుత్వ కొలువులు సాధించారు. ప్రతిభను నమ్ముకొని అభ్యర్థులు పరీక్షలు రాయాలి.
– భల్లా శ్రావణ్కుమార్, తహసీల్దార్ కార్యాలయ టైపిస్ట్, బోనకల్లు
మా స్వస్థలం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం. నేను ప్రభుత్వ ఉద్యోగం చేయాలనేది నాన్న కల. నాన్న ఎన్నో కష్టాలు పడి నన్ను చదివించారు. ఎలక్ట్రీషియన్గా కుటుంబాన్ని పోషిస్తూనే నన్ను చదివించారు. పాఠశాల విద్య తర్వాత నేను బాసరలో బీటెక్ పూర్తి చేశా. తర్వాత సొంతంగా పోటీపరీక్షలకు ప్రిపేర్ అవడం ప్రారంభించా. 2016లో టీఎస్పీఎస్సీ ఏఈ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ రాకముందు నుంచే పరీక్షలకు సన్నద్ధమవడంతో పరీక్ష సునాయాసంగా రాశా. పరీక్షా ఫలితాల్లో మెరిట్ సాధించా. ఏఈగా పోస్టింగ్ అందుకున్నా. ప్రస్తుతం బూర్గంపహాడ్ మండలంలో మిషన్భగీరథ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నా. నాన్న కల నెరవేర్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతిభతో ఉద్యోగం సాధించడం మరింత సంతృప్తినిచ్చింది. ఒకటి, రెండు ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలు జరిగినంత మాత్రాన అభ్యర్థులు కంగారుపడాల్సిన అవసరం లేదు. కచ్చితమైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి. సర్కార్ కొలువు సాధించండి.
– రవితేజ, మిషన్ భగీరథ ఏఈ, బూర్గంపహాడ్
మాది ఖమ్మం నగరం. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు చదువంతా నగరంలోనే సాగింది. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్న నన్ను కష్టపడి చదివించారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనే నేను పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాను. 2017లో టీఎస్పీఎస్సీ తెలంగాణ గురుకుల టీచర్స్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నాను. పరీక్షా ఫలితాల్లో మంచి మెరిట్ సాధించా. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని గురుకుల పాఠశాలలో బయాలజీ టీచర్గా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నా. ఉద్యోగాల సాధనలో ఎలాంటి పైరవీలు, లంచాలకు తావు లేదు. ప్రతిభ ఉంటే చాలు. మెరిట్ సాధిస్తే చాలు. కొలువు కచ్చితంగా వస్తుంది. ఒకరిద్దరు చేసిన పేపర్ లీకేజీలను చూసి అభ్యర్థులు కలత చెందొద్దు. మళ్లీ టీఎస్పీఎస్సీ నిర్వహించే తేదీకి అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సిద్ధమవ్వాలి. సర్కార్ నిరుద్యోగుల పక్షానే నిలుస్తుంది.
– ఎల్బీ వాసుదేవ్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఖమ్మం
మా స్వగ్రామం అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం. మాది అత్యంత పేద కుటుంబం. అమ్మానాన్న వ్యవసాయం చేస్తూ నాతోపాటు తమ్ముడిని చదివించారు. నా ప్రాథమిక విద్య స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, ఇంటర్మీడియట్ విజయవాడ, డిగ్రీ సత్తుపల్లిలోని కళాశాలల్లో సాగింది. డిగ్రీ తర్వాత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం ప్రారంభించా. మూడేండ్లు శ్రమించా. 2018 టీఎస్పీఎస్సీ విడుదల చేసిన మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేశా. పరీక్ష రాశాను. మంచి మెరిట్ సాధించి 2019లో నేను స్టాటిస్టికల్ ఆఫీసర్గా పోస్టింగ్ అందుకున్నాను. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పకడ్బందీగా జరిగింది. పైరవీలు, అక్రమాలకు తావు లేదు. టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ నా జీవితంలో వెలుగును ఇచ్చింది. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారు భయాలు మానుకోవాలి. ప్రణాళికాబద్ధంగా చదివి కొలువు సాధించొచ్చు.
– జుబ్బురు దుర్గారావు, ఏఎస్వో, అన్నపురెడ్డిపల్లి మండలం
మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న దివ్యాంగుడు. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నన్ను చదివించారు. డిగ్రీ తర్వాత నేను పోటీపరీక్షలకు సిద్ధమవ్వాలనుకున్నా. 2012 నుంచి పట్టువిడవకుండా చదువుతూనే ఉన్నా. 2018లో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నా. పరీక్ష బాగా రాశాను. మెరిట్ లిస్ట్లో నా పేరు వచ్చింది. ఇదే ఏడాది పోస్టింగ్ అందుకున్నా. నాన్న కల నెరవేర్చా. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరగడంతోనే నేను కొలువు సాధించా. దళారుల ప్రమేయం లేదు. లంచం ఇవ్వనక్కర్లేదు. టీఎస్పీఎస్సీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంది.
– తోటమళ్ల రమాదేవి, ట్రెయిన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్, కొత్తగూడెం
మాది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామం. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు. మాది అత్యంత పేద కుటుంబం. మా ఊర్లో చిన్న ఇల్లు తప్ప మాకేమీ లేదు. నేను ప్రభుత్వ విద్యాలయాల్లోనే డిగ్రీ వరకు చదువుకున్నాను. టీఎస్పీఎస్సీ 2018 విడుదల చేసిన టీజీటీ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నాను. పరీక్ష రాసి మెరిట్ సాధించా. టీజీటీగా కొత్తగూడెం మైనార్టీ గురుకులంలో పోస్టింగ్ తీసుకున్నా. నా భర్త కూడా ఎస్జీటీ టీచరే. ఆయన వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం పర్వతపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాకుంటే మాకు ఉద్యోగాలు వచ్చేవి కావు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడంతోనే ప్రతిభ ఉన్నవారందరినీ ప్రభుత్వ కొలువులు వరించాయి. – గిన్నె రజిత, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, బీసీ
మా స్వస్థలం భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణం. నాన్న సింగరేణి ఉద్యోగిగా రిటైర్ అయ్యారు.నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వం ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇల్లెందులోనే చదువుకున్నా. ఎంసెట్ రాసి అశ్వారావుపేట అగ్రికల్చర్ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ సీటు సాధించాను. కోర్సు తర్వాత కొద్దిరోజుల పాటు ఆత్మ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేశా. 2016లో టీఎస్పీఎస్సీ ఏఈవో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2017లో పరీక్ష రాశాను. ఏఈవోగా కొలువు సాధించాను. నాతో పాటు ఎంతోమంది స్నేహితులు చిన్న వయస్సులోనే ఉద్యోగం సాధించారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తుండడంతోనే నాతోపాటు ఎంతోమంది కల నెరవేరింది.
– ఎం.ఆదర్శ్, ఏఈవో, ఎంవీ పాలెం క్లస్టర్, ఖమ్మం రూరల్ మండలం
మా స్వస్థలం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం. నేను ఒకటి నుంచి 5వ తరగతి వరకు మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, 6 నుంచి 10వ వరకు అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివాను. అనంతరం ఓ ప్రైవేటు కళాశాలలో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేశాను. అప్పటికి స్వరాష్ట్రం ఏర్పడలేదు. ఉమ్మడి పాలనే సాగుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ ప్రభుత్వ కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తున్నది. నాకు సర్కార్ ఉద్యోగం చేయాలని, కుటుంబానికి అండగా నిలవాలనే కోరిక ఉండేది. అందుకు ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా ఇంట్లో ఉండే గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను. 2016 నోటిఫికేషన్లో ఏఈవో పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాను. 2017లో కొలువు సాధించాను. ఎవరి రికమెండేషన్ లేకుండా, చిల్లిగవ్వ చెల్లించకుండా కేవలం మెరిట్ ద్వారా ఉద్యోగం పొందాను. ప్రస్తుతం వేంసూర్ మండలంలో పనిచేస్తున్నాను. టీఎస్పీఎస్సీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడంతోనే అది సాధ్యమైంది. మాలాంటి నిరుపేద అభ్యర్థుల కలలు సాకారమయ్యాయి.
– సంగం అనూష, ఏఈవో, వెంకటాయపాలెం క్లస్టర్, వేంసూరు మండలం
మా స్వస్థలం హనుమకొండ. మాది సాధారణ కుటుంబం. స్కూలింగ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వరంగల్ జిల్లాలోనే చదువు. తర్వాత బీఫార్మసీ పూర్తి చేశా. మాది వ్యవసాయ కుటుంబం. టీఎస్పీఎస్సీ గ్రూప్ పరీక్షలకు సిద్ధమవ్వాలనుకున్నా. సొంతంగా మెటీరియల్ సంపాదించి ఇంట్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారు. 2015లో టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016లో పరీక్ష రాసి మెరిట్ సాధించా. తర్వాత పంచాయతీ కార్యదర్శి కొలువు సాధించా. బ్యాంకింగ్ రంగంలో మరో కొలువు సాధించా. కానీ నాకు గ్రూప్-2 కొలువు చేయాలని కోరిక. 2020లో అశ్వారావుపేట డిప్యూటీ తహసీల్దార్గా నియామక పత్రం అందుకున్నా. ఎలాంటి కోచింగ్ లేకుండా మెరిట్తో కొలువు సాధించా. నా కష్టానికి తగిన ఫలం వచ్చింది. ప్రజల సేవలో ఆనందంగా విధులు నిర్వర్తిస్తున్నా.
– రేనా సుచిత్ర, డిప్యూటీ తహసీల్దార్, అశ్వారావుపేట
మా స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం మండలం బంజరతండా గ్రామం. నేను ఒకటి నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకున్నా. 2015లో విడుదలైన టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్కు దరఖాస్తు చేశా. 2016లో పరీక్ష రాశా. పరీక్షా ఫలితాల్లో నేను మెరిట్ సాధించా. ఎంపీవోగా పోస్టింగ్ అందుకున్నా. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు వదంతులు నమ్మొద్దు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలకు చోటులేదు. పైరవీలకు తావు లేదు. మెరిట్ సాధిస్తే ఎవరికైనా కొలువు వస్తుంది. గ్రూప్-2నే కాదు అంతకుముందు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో పాటు మరోరెండు ఉద్యోగాలూ సాధించా. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించకపోతే నేను ఇన్ని ఉద్యోగాలు సాధించేవాడిని కాదు. ప్రస్తుతం వేంసూరు మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నా.
– భూక్యా రంజిత్కుమార్, ఎంపీవో, వేంసూరు మండలం
మా స్వస్థలం ఖమ్మం జిల్లాలోని వేంసూరు. మాది సాధారణ కుటుంబం. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సర్కార్ కొలువు చేయాలనే ఆకాంక్ష ఉండేది. దీనిలో భాగంగా 2017లో టీఎస్పీఎస్సీ టెక్నికల్ సివిల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి దగ్గరే కష్టపడి చదివాను. మెరిట్ సాధించాను. 2018లో అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లిలో డిప్యూటీ సర్వేయర్గా పోస్టింగ్ అందుకున్నా. ప్రస్తుతం అశ్వారావుపేట సర్వే ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నా. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేదు. అవినీతికి ఆస్కారం లేదు. మెరిట్తోనే నేను కొలువు సాధించాను. అందుకు గర్వంగా ఉంది.
– జి.నాగరాజు, సర్వే ఆఫీసర్, అశ్వారావుపేట