రైతుల పంటల సాగు కోసం 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టును నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పెనుబల్లి మండలంలోని పులిగొండం చెరువు (ప్రాజెక్టు) ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. నాడు రైతులకు సాగునీరు అందించేందుకు కట్టామని చెబుతున్న ఈ కాంగ్రెస్ పాలకులు.. నేడు పర్యాటకంలో ఫొటోల కోసం, సెల్ఫీల కోసమే ఈ ప్రాజెక్టును కట్టామని చెబుతుండడంపై మండిపడుతున్నారు. పైగా, ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల చేయకుండా పంటలను ఎండబెడుతున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులుగానీ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు.
ఈ మూడు దశాబ్దాలపాటు తమ పంటల సాగు కోసం ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసిన అధికారులు.. ఇప్పుడు ఎకో టూరిజం కోసమే ఈ నీళ్ల నిల్వ ఉంచుతామని, రైతుల పంటల సాగు కోసం నీళ్లు విడుదల చేయబోమని స్పష్టం చేస్తుండడం ఏమిటని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సదరు ప్రాజెక్టు వద్ద ఆందోళన కూడా చేపట్టారు. ఈ ప్రాజెక్టు నీటిని నమ్ముకొని పంటలు వేసుకున్న మూడు గ్రామాల్లోని 450 మంది రైతులకు చెందిన 900 ఎకరాల్లోని పంటల పరిస్థితి అగమ్యగోచరమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-పెనుబల్లి, మార్చి 9
పెనుబల్లి మండలంలోని మూడు గ్రామాల గిరిజన రైతులకు సాగునీరు అందించేందుకు 30 ఏళ్ల క్రితం ఇక్కడి అడవిలో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి, అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జలగం ప్రసాదరావు కలిసి ఆలోచన చేశారు. ఇందులో భాగంగా ఇదే మండలంలో బ్రహ్మాళ్లకుంట అటవీ ప్రాంతంలోని గుట్టలను ఆనుకొని పులిగొండం చెరువు (ప్రాజెక్టు)ను నిర్మించారు. దీంతో దాని ఆయకట్టు కింద మూడు గ్రామాల గిరిజన రైతులు ఈ మూడు దశాబ్దాలుగా ఏడాదికి రెండు పంటలూ సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. దీంతో ఈ మూడు గ్రామాల్లోని సాగుభూములన్నీ సస్యశ్యామలమయ్యాయి. బ్రహ్మాళ్లకుంట గిరిజనులు; బత్తులపల్లి దళితులు, గిరిజనులు; తాళ్లపెంట గిరిజనుల పొలాలకు ఈ ప్రాజెక్టు నీళ్లు పుష్కలంగా అందేవి. ప్రాజెక్టు నిర్మించిన సమయంలో ఒక్కో గ్రామంలో సుమారు 200 ఎకరాల చొప్పున మూడు గ్రామాల్లో సుమారు 600 ఎకరాలు రెండు సీజన్లలోనూ పూర్తిస్థాయిలో సాగులో ఉండేవి. కాలక్రమంలో బీడు భూములు కూడా మాగాణిగా మారడంతో ఈ మూడు గ్రామాల్లో కలిపి 450 మంది రైతులకు చెందిన 900 ఎకరాలు సాగులోకి వచ్చాయి.
పిడుగులా ‘ఎకో టూరిజం’..
సదరు రైతులు రెండు పంటలనూ పండించుకుంటూ తమ భూములను సేద్యం చేసుకుంటున్న సమయంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఎకో టూరిజం’ అనే పిడుగును రైతులపై పడేసింది. ఎకో టూరిజం కోసం ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీటిని కూడా విడుదల చేయబోమంటూ సంబంధిత అధికారులు చెబుతుండడంతో ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు. అన్నట్లుగానే ఈసారి ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయలేదు. దీంతో ఆయకట్టు పొలాలన్నీ నెర్రెలువారి ఎండిపోతున్నాయి. ఎవరో ఎక్కడి నుంచో పర్యాటకులు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఈ ప్రాజెక్టు వద్ద అనుమతి ఇస్తున్నారుగానీ ఇన్నాళ్లూ సాగు చేసుకుంటున్న తమ పంటలను కాపాడేందుకు నీళ్లెందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కనీసం ఇటువైపు తొంగి చూడడం లేదని, రైతుల పంటలకు భరోసా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి అవసరాల కోసం 30 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టును ఇప్పుడు ఎకో టూరిజం కోసం ఎందుకు వినియోగిస్తున్నారని, మరి దాని ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
30 ఏళ్లుగా లేనిది ఇప్పుడేంటి?
ఇక్కడి రైతుల సాగు భూములను సస్యశ్యామలం చేసేందుకు 30 ఏళ్ల క్రితం నిర్మించిన పులిగొండం చెరువును ఇప్పుడెందుకు ఎకో టూరిజం కోసం వినియోగిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇక్కడి రైతుల కోసం నాటి మంత్రి జలగం ప్రసాదరావు చొరవ తీసుకొని బ్రహ్మాళ్లకుంట అడవిలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు నుంచి ఇన్నాళ్లూ నీళ్లు ఇచ్చిన అధికారులు ఎప్పుడెందుకు ఇవ్వడం లేదు? ఇప్పుడు మా పంటల పరిస్థితేంటి?
-బానోతు గోపి, రైతు, బ్రహ్మాళ్లకుంట
ముగ్గురు మంత్రులు ఉన్నా పట్టించుకోవడం లేదు..
ఈ ప్రాజెక్టు కింద అటవీ శాఖ అధికారులు రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కనీసం ఒక్కళ్లు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. 30 ఏళ్లనాడే సాగునీళ్లు ఇవ్వకుండా ఉంటే ఏ ఇబ్బందులూ ఉండేవి కాదు. అకస్మాత్తుగా ఇప్పుడే నీటి విడుదలను నిలుపుదల చేయడమేంటి? పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా?
– బానోతు నాగేశ్వరరావు, రైతు, బ్రహ్మాళ్లకుంట
రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టాం.. పంటలు ఎండిపోతున్నాయి..
రైతుల కోసం ఆనాటి ప్రభుత్వం చెరువు నిర్మిస్తే.. ఇప్పటి ప్రభుత్వం ఆ చెరువును ఎకో టూరిజానికి కేటాయించింది. దీంతో ఫారెస్టు అధికారులు ఆ చెరువు నుంచి నీళ్లు ఇవ్వకుండా అడ్డు తగులుతున్నారు. అసలు ఆ చెరువు నిర్మించిందే పంటల సాగు కోసం కదా. మరి ఇప్పుడు ఆ చెరువును ఫొటోల కోసం, సెల్ఫీల కోసం వినియోగించడం ఏమిటి? ఎకో టూరిజం పేరు చెప్పి గిరిజనులను కనీసం అడవిలోకి కూడా పోనివ్వడం లేదు. పశువులను కూడా వెళ్లనీయడం లేదు.
– బేతి సలీం, రైతు, బ్రహ్మాళ్లకుంట