ఎర్రుపాలెం, మే 22 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఐకెపి (సెర్ప్) పరిధిలో పని చేస్తున్న వీఓఏలు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం వీఓఏ జాక్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో పాల్గొని ఎర్రుపాలెం ఐకేపీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 363/2025 అలాగే జీఓ 302/2022 ప్రకారం అమలు చేయాల్సిన పలు అంశాలు ఇంకా అమలులోకి రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముఖ్యంగా వీఓఏ లకు తగిన వేతనాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
తమ ప్రధాన డిమాండ్లు అయిన నెలకు రూ.20 వేల వేతనం అమలు చేయాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేసి, అర్హులైన వీఓఏలను సీసీ లుగా ప్రమోట్ చేయాలని, రూ.20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, వీఓఏ లకు ట్యాబ్ సౌకర్యం కల్పించాలని, జీఓ 58ను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమ్మె చేస్తున్న వీఓఏ లకు ఏపీఓ నాగరాజు, ఈజిఎస్ సిబ్బంది, మండల జీపీఓలు తమ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఓఏల మండల అధ్యక్షురాలు పడగల కనకదుర్గ, వీఓఏలు శీలం కనకదుర్గ, కొత్తపల్లి రాణి, కోటా హేమలత, కోలా ఏడుకొండలు, పద్మ, జంగా నాగమణి, వేమిరెడ్డి సుజాత, రజిత, జరీనా, ప్రశాంతి, వరలక్ష్మి, లావణ్య, కమల, సరోజిని పాల్గొన్నారు.