సత్తుపల్లి, ఆగస్టు 10 : జేపీఎస్(జూనియర్ పంచాయతీ కార్యదర్శి)లను నాల్గవ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారి పనితీరు ఆధారంగా 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. జిల్లావ్యాప్తంగా 480 మంది జేపీఎస్లు ఉండగా.. వీరిలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 300 మంది ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వీరిని రెగ్యులరైజ్ చేసేందుకు కసరత్తు షురూ చేసింది. తమను రెగ్యులరైజ్ చేయాలని చేసుకున్న విన్నపాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు కార్యదర్శులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీల్లో కమిటీల బృందం పరిశీలన& పనితీరు ఆధారంగా జేపీఎస్లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ నేతృత్వంలో డీపీవో, పోలీస్, అటవీ శాఖ అధికారులతో కూడిన బృందం పంచాయతీల్లో కార్యదర్శులు చేపట్టిన నిర్వహణ, అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నది. పంచాయతీ ట్రాక్టర్ల కిస్తీలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వారి పనితీరు ఆధారంగా 70 శాతం మార్కులు దాటిన వారిని మాత్రమే క్రమబద్ధీకరించేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే జిల్లాలోని చింతకాని, రఘునాథపాలెం, కొణిజర్ల, ఖమ్మం రూరల్, తల్లాడ తదితర ప్రాంతాల్లో పరిశీలన పూర్తి చేశారు. మిగిలిన పంచాయతీల్లో సైతం పరిశీలన చేసి క్రమబద్ధీకరణ కసరత్తు పూర్తి చేయనున్నారు.
పంచాయతీల్లో తమ సేవలను ప్రభుత్వం గుర్తించడంపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనుండడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
జేపీఎస్ల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మా సమస్యలను గుర్తించి ఎలాంటి కమిటీలు లేకుండా అందరినీ రెగ్యులర్ చేస్తే గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలూ పనిచేస్తాం. మరింత ఉత్సాహంగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొస్తాం. మా కలలను నిజం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– దామాల కిరణ్, సంఘం ప్రధాన కార్యదర్శి, బోనకల్
తెలంగాణ ప్రభుత్వ తోడ్పాటుతో గ్రామపంచాయతీల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించి క్రమబద్ధీకరణ చేయడంతో మాకు ఉద్యోగ భద్రత లభించినైట్లెంది. జిల్లాలో ఉన్న 480 మందిని కూడా రెగ్యులర్ చేయాలి. అప్పుడే మా కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. అందరికీ న్యాయం జరిగినట్లు అవుతుంది.
– వినోద్కుమార్, సంఘం ప్రధాన కార్యదర్శి,
ప్రభుత్వ నిర్ణయంతో జేపీఎస్లు గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా మారనుండడంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. కొత్త పంచాయతీలు ఏర్పడిన తర్వాత జేపీఎస్లు పల్లెల అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. కాంట్రా క్టు జేపీఎస్లను సైతం క్రమబద్ధీకరిస్తే బాగుంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ను సర్వీసు కాలంగా పరిగణించి ప్రభుత్వం ఆదుకోవాలి.
– భూక్యా సైదులు, జేపీఎస్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, మధిర