ఖమ్మం/ఖమ్మం సిటీ, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం పండుగలా నిర్వహించారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగా ప్రాధాన్యతను వివరిస్తూ వయసుతో నిమిత్తం లేకుండా ఆసనాలు వేశారు. యోగాతోనే ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అంటూ నిర్వాహకులు అవగాహన కల్పించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా ఆయుష్, యువజన క్రీడల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్తో కలిసి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా కొందరిది కాదని.. ఇది అందరిదని, కులం, మతం, వర్గం, భాషకు సంబంధించింది కాదని, ఏళ్ల నుంచి తరతరాలుగా వస్తున్నదని పేర్కొన్నారు. పెద్దలు ఇచ్చిన ఆస్తిగా యోగాను కలెక్టర్ అభివర్ణించారు. మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ ఒకటే సరిపోదని, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఆందోళనలు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
వివిధ రకాల వ్యాయామాలతో మానసిక దృఢత్వాన్ని పొందుతామని, తద్వారా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తామన్నారు. సమయం కుదరడం లేదని తప్పించుకోవడం సరికాదని, పరిస్థితిని బట్టి ఒకటి, రెండు నిమిషాలు కూడా యోగా చేయవచ్చన్నారు. 2024 సంవత్సరానికి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీగా చెప్పారని, అందుకే ప్రతి ఒకరూ ఈరోజు నుంచి క్రమం తప్పకుండా ఎంతో కొంత సమయం యోగా కోసం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో సునీల్రెడ్డి, లక్ష్మీనారాయణ, డాక్టర్ రాంచందర్రావు, డాక్టర్ రవికుమార్, అర్బన్ తహసీల్దార్ స్వామి, అధికారులు పాల్గొన్నారు.