ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 28: ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం మొదటి సంవత్సర విద్యార్థులకు జరిగిన రసాయన శాస్త్రం/కామర్స్-1తో పరీక్షలు ముగిశాయి. బుధవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రసాయన శాస్త్రం/కామర్స్-2 పరీక్షతో పరీక్షలు ముగియనున్నాయి. ఇప్పటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగిసిన ఆనందంతో పరీక్షా కేంద్రాల వద్ద కేరింతలతో సందడి చేశారు.
ఇళ్లకు దూరంగా హాస్టల్లో ఉంటూ చదివిన విద్యార్థులందరూ ఈ పరీక్షలు ముగియడంతో ఇంటిబాట పట్టారు. తల్లిదండ్రులందరూ హాస్టళ్లకు చేరుకొని తమ పిల్లలను స్వగృహాలకు తీసుకెళ్లారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి రవిబాబు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షల్లో నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. మంగళవారం జరిగిన పరీక్షల్లో 17,337 మందికి 16,643 మంది విద్యార్థులు హాజరుకాగా 694 మంది గైర్హాజరయ్యారు.