జోరందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
సీపీఐ మద్దతు కోరిన టీఆర్ఎస్ నేతలు
సానుకూలంగా స్పందించిన సీపీఐ
మంత్రి పువ్వాడ నేతృత్వంలో ఆ పార్టీ నేతలతో భేటీ
ఖమ్మం, సత్తుపల్లి, వైరా, మధిరలో సమావేశాల జోరు
అవిభక్త ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నిక
ఖమ్మం, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);చలిలోనూ వేడి పుట్టిస్తోంది.. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయం నల్లేరుపై నడక కాగా.. ప్రత్యర్థులకు చలిలోనూ ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ స్థానిక సంస్థల నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. దాదాపు 500 మందికి పైగా సభ్యులు గులాబీ పార్టీకి చెందినవారే ఉండడంతో ఆ పార్టీ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ముందస్తు వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ నాయకులు వివిధ రాజకీయ పక్షాల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కోరుతున్నారు. ఒకవేళ పోటీ అనివార్యమైతే సీపీఐ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అవిభక్త ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి తాతా మధు విజయంవైపు దూసుకెళ్తున్నారు. ఈ స్థానిక సంస్థల నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండగా.. టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఓట్లు ఉన్నాయి.
సీపీఐ నేతలతో భేటీ..
ఒకవేళ పోటీ అనివార్యమైతే తమకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో సీపీఐ నేతలను కోరారు. బుధవారం ఖమ్మం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, ఆ పార్టీ నేతలతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి మధుకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి ఆ పార్టీ నాయకులు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసింది. ఈ నేపథ్యంలో సీపీఐ నిర్ణయం టీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. తొలుత పువ్వాడ నాగేశ్వరరావును టీఆర్ఎస్ నేతలు శాలువాతో సన్మానించారు. ఈ భేటీలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు బాగం హేమంతరావు, మౌలానా, జమ్ముల జితేందర్రెడ్డి, జానిమియా పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నా వామపక్షాలు ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వామపక్షాలు తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉండగా.. మంత్రి అజయ్ నేతృత్వంలో ఎన్నిక ఏకగ్రీవానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
జోరందుకున్న ప్రచారం..
ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇప్పటికే తాతా మధు గెలుపుపై ప్రత్యేక దృష్టిసారించారు. గెలుపు ఏకపక్షమే అయినా ముందుస్తు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థులకు నామ మాత్రపు ఓట్లు కూడా లేకపోయినా.. భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగురవేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు మిత్రపక్షంగా ఉన్న సీపీఐతో చర్చలు జరిపారు. త్వరలో మద్దతు అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
సమావేశాల జోరు..
ఈ నెల 23న నామినేషన్ల ఘట్టం ముగియడంతో టీఆర్ఎస అభ్యర్థి తాతా మధు ఎన్నికల ప్రచారానికి తెర తీశారు. బుధవారం సత్తుపల్లి, వైరా నియోజవకర్గంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి సమావేశాలు నిర్వహించారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు రాములునాయక్ నేతృత్వంలో మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు.
రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్కు అత్యంత కీలకమని, పార్టీకి మెజారిటీ ఉన్నా.. అప్రమత్తంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి తాతా మధుకు భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఖమ్మం జడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలాలకు చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో, మధిర టీఆర్ఎస్ కార్యాలయంలో మధిర మండలం, మున్సిపాలిటీ, ఎర్రుపాలెం మండలాల టీఆర్ఎస్ ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు.