కారేపల్లి, మే 19 : కారేపల్లి మండలంలోని మొక్కజొన్న స్టాక్ పాయింట్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ శాఖ డీఎం జే.నరేందర్ మంగళవారం తనిఖీ చేశారు. అప్పాయిగూడెం గోదాం, జిన్నింగ్ మిల్ స్టాక్ పాయింట్లను డీఎం పరిశీలించారు. సోమవారం రాత్రి కారేపల్లిలో రైతులు అందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ రైతు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కారేపల్లి మండల రైతుల మొక్కజొన్నను స్ధానికంగానే దిగుమతి చేయడానికి అవకాశాలు పరిశీలించాలని కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు.
కలెక్టర్ ఆదేశాలతో మార్కెటింగ్ డీఎం గోదాంలను పరిశీలించారు. ఈ సందర్బంగా సోసైటీ డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బొంతు రాంబాబు, దుగ్గి కృష్ణ జిన్నింగ్ మిల్లు స్టాక్ పాయింట్లో కారేపల్లి మండల రైతులకు అవకాశం కల్పించాలని డీఎంను కోరారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పోన్లో డీఎంతో మాట్లాడి స్ధానిక రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. డీఎం వెంట సొసైటీ కార్యదర్శి బొల్లు హనుమంతరావు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది ఉన్నారు.

కారేపల్లిలో మొక్కజొన్న స్టాక్ పాయింట్ల తనిఖీ