ఖమ్మం, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సవాల్ విసిరారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి.. బీసీలను నమ్మించి మోసం చేశాడని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని భద్రాద్రి జిల్లా పర్యటనకు వస్తున్నాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
బీసీ వర్గాలకు న్యాయం చేసినట్లు గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. గతంలో బీఆర్ఎస్ పార్టీ కన్నా ఖమ్మం జిల్లాలో బీసీలకు రిజర్వేషన్ పేరుతో మేలు చేసినట్లు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో పేరుకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి శూన్యమన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని, జోగులాంబ గద్వాల, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పర్యటన చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ అమలు కాని నంబర్ గేమ్ మాత్రమేనని వెల్లడించారన్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 571 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఇందులో బీసీలకు 22.2 శాతం ప్రకారంగా రావాల్సిన సర్పంచ్ స్థానాలు 127 వరకు ఉన్నాయని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీసీలకు 54 సర్పంచ్ స్థానాలు మాత్రమే కేటాయించి, వారిని తీవ్ర మోసానికి గురి చేసిందని దుయ్యబట్టారు.
భద్రాద్రి జిల్లాలో మంగళవారం జరిగే సీఎం పర్యటనపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని తాతా మధు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ చీరలు ఇచ్చామని, మహిళలు చీరలు కట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నికల విలువలను దిగజార్చడమే అవుతుందని మండిపడ్డారు. రెండేళ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏమిటో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులను ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మద్దతు ధర పేరుతో దగా చేస్తున్నారని, మార్కెట్లో దళారుల దందా పెరిగిపోయిందని ఆరోపించారు. వరదలతో పంట నష్టపోయిన రైతులు, ప్రజలకు సాయం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో యూరియా కోసం రైతులు నానా కష్టాలు పడ్డారని, ఈ ప్రభుత్వం రైతులను శత్రువుల మాదిరిగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం జిల్లా కేంద్రంలో 28 ఎకరాల స్థలం కేటాయిస్తే.. దానిని పంపిణీ చేయకుండా వారిని నిట్టనిలువునా వంచిస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు బిచ్చాల తిరుమలరావు, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు తాజుద్దీన్, గుండ్లపల్లి శేషగిరి, పగడాల నరేందర్, కార్పొరేటర్లు మగ్బుల్, మాటేటి నాగేశ్వరరావు, బలుసు మురళీకృష్ణ, లింగనబోయిన సతీశ్, చీకటి రాంబాబు, వంశీ, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.