ఇల్లెందు, మే 9 : అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం చంద్రుతండా పరిధిలోని రాజుతండా, చంద్రుతండా, సూర్యాతండా, గోప్యాతండాకు చెందిన గిరిజనులు చంద్రుతండా పంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ తమ తండాల్లో అర్హులైన వారికి ఇండ్లు కేటాయించకుండా.. అనర్హులకు, ఆర్థికంగా ఉన్న వారికి కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.
ఇందిరమ్మ కమిటీలు ఉన్నప్పటికీ అర్హులైన నిరుపేదలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి రూ.50 వేల చొప్పున కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. రాజుతండాకు చెందిన జర్పుల రమేశ్-లలిత దంపతులకు తొలి జాబితాలో పేరుండడంతో ఇల్లు వస్తుందనే ఆశతో ఉన్న గుడిసెను తొలగించుకున్నారని, ఇప్పుడు ఇండ్ల జాబితాలో మీ పేరు లేదని చెప్పడంతో వారి కుటుంబం రోడ్డున పడిందని తెలిపారు.
ఎలా ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు కూల్చుకొని ఎదురుచూస్తున్నా అధికారులు, ప్రభుత్వం కనికరం చూపడం లేదన్నారు. వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని గిరిజనులు కోరారు. కార్యక్రమంలో ఆయా తండాల గిరిజనులు బానోత్ రవి, విజయ, గుగులోత్ చందర్, గుగులోత్ హనుమా, కళ్యాణి, రమేశ్, భూక్యా మంగ్తి, భూక్యా పూలా, భూక్యా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.