చండ్రుగొండ, ఏప్రిల్ 24 : పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న ఇందిరమ్మ ఇళ్లను అధికార పార్టీ నాయకులు పెద్దపెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్తులు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు అడిగిన డబ్బులను ఇవ్వలేకపోయిన కారణంగా తమకు ఇళ్లను రాకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి జాబితాలో పేర్లు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం కాంగ్రెస్ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ గుర్రంగూడెం గ్రామస్తులు గురువారం తమ గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ.. తమ ఊరిలో 79 మందితో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను తయారు చేశారని, వారిలో 18 మందికి ఇళ్లు మంజూరైనట్లు జాబితాను ప్రదర్శించారని అన్నారు.
వీరిలో అనర్హులే అత్యధికులు ఉన్నట్లు చెప్పారు. అయితే, రూ.50 వేలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు వస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు గోవిందరెడ్డి, శ్రీధర్రెడ్డి స్పష్టం చేస్తున్నారని అన్నారు. పేదలకు దక్కాల్సిన ఇళ్లను డబ్బులున్న వాళ్లకే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు రాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. కాగా, ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు.
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హులకు చోటుదక్కలేదనే విషయంపై ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు గుర్రంగూడెంలో గురువారం విచారణ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి విచారణ చేస్తున్న ఆయనకు గ్రామస్తులు పలు విషయాలు తెలియజేశారు. అనర్హులకు ఇస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆ గ్రామ ప్రత్యేకాధికారి ఎదుటే గ్రామస్తులతో అధికార పార్టీ నాయకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయితే, అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో సదరు ప్రత్యేకాధికారి వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను పరిశీలిస్తూ విచారణ చేస్తున్న సమయంలో గుర్రంగూడెంలో గొడవలు జరిగాయి. దీంతో విచారణను నిలిపివేశాం. గ్రామంలో ఘర్షణలు సద్దుమణిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత అర్హుల జాబితాను పరిశీలిస్తాం. డబ్బుల వసూలుపై నాకు లిఖితపూర్వక ఫిర్యాదులు అందలేదు. ఫిర్యాదు వస్తే విచారణ చేస్తాం.
– శ్రీనివాసరావు, గ్రామ ప్రత్యేకాధికారి
ఇందిరమ్మ ఇంటి కోసం రూ.50 వేలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్రెడ్డి, గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. నా దగ్గరలేవని అన్నాను. దీంతో వారు నాకు ఇల్లు రాకుండా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారు. పేదలకు ఇస్తామన్న ఇళ్లను డబ్బులిచ్చినోళ్లకు అమ్ముకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
-ముత్తినేని లక్ష్మి, గుర్రంగూడెం
ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేసేటప్పుడు అర్హుల జాబితాలో నా పేరు ఉంది. కానీ.. ఫైనల్ జాబితాలో నా పేరు లేకుండా చేశారు. పెద్దపెద్దవాళ్లే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వారి పేర్లను రాసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రీధర్రెడ్డి, గోవిందరెడ్డి డబ్బులు అడిగినప్పుడు నేను ఇవ్వలేదు. అందుకే నాకు ఇల్లు రాకుండా చేశారు. నాకు ఇల్లు వచ్చేలా చేయండి సార్.
-పద్దం సుశీల, గిరిజన మహిళ, గుర్రంగూడెం
మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించేందుకు మా ఊర్లోని పెద్ద నాయకుడు వెంకటేశ్వర్లు రూ.60 వేలు లంచం అడిగాడు. ఇవ్వలేదని మాకు ఇల్లు రాకుండా చేశాడు. గ్రామంలో పేదలకు ఇళ్లు రాకుండా కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారు. అధికారులు గ్రామానికి వచ్చి పేదలను, అర్హతలను పరిశీలించకుండానే ఇళ్లు ఎలా మంజూరు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంతటి అన్యాయం మరెక్కడా లేదు.
-చీమల కవిత, గుర్రంగూడెం