మధిర: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం పట్ల మధిర ఎంపీపీ మెండెం లలిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆడపడుచులు అమ్మా, నాన్నలకు భారం కావద్దని గుర్తించి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 పెళ్లి కానుకగా ఇస్తున్నారని తెలిపారు.
అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగితే రూ.12 వేలు ఆర్థిక సహాయాన్ని, 16 వస్తువులతో కేసీఆర్ కిట్ను అందిస్తున్నారని గుర్తుచేశారు. దళితబంధు పథకం ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, ప్రతి దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.