ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల ఆదాయం లక్ష్యాన్ని మించింది. 2022-23 సంవత్సరానికిగాను రాష్ట్ర మార్కెటింగ్శాఖ జిల్లా మార్కెట్లకు రూ.54.36 కోట్లు లక్ష్యం నిర్దేశించగా.. రూ.57 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఆశించిన మేర పంట దిగుబడులు రాకపోయినా మార్కెట్లలో పంట ఉత్పత్తులు ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో లక్ష్యచేధన సులభతరమైంది. మద్దులపల్లి, మధిర వ్యవసాయ మార్కెట్లు మినహా మిగిలిన ఆరు మార్కెట్లు నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయి. కాగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది.
ఖమ్మం వ్యవసాయం, మార్చి 31: రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన విధంగానే జిల్లాలో వ్యవసాయ మార్కెట్లు ఆదాయం సాధించాయి. గడిచిన రెండేళ్ల నుంచి వ్యవసాయ మార్కెట్ల ఆదాయం ఆశించిన విధంగా వస్తోంది. అందులో భాగంగానే 2022-23 సంవత్సరానికి గాను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జిల్లా మార్కెటింగ్ శాఖకు రూ.54.36 కోట్ల లక్ష్యం నిర్దేశించగా.. అందుకు అనుగుణంగానే రూ.57 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఆశించిన మేర పంట దిగుబడులు రాకపోయినప్పటికీ మార్కెట్లలో పంట ఉత్పత్తులు ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో లక్ష్యచేధన సులభతరమైంది. ఈ ఏడాది వానకాలం సాగు పనులు సకాలంలో ప్రారంభమయ్యాయి. ఆశించిన మేర వర్షపాతమూ నమోదైంది. దీంతో పంట దిగుబడులు భారీగా పెరిగాయి. మిర్చిపంటను మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల పంటల దిగుబడులూ ఆశించిన మేర వచ్చాయి. అయితే ఈ సంవత్సరం ప్రైవేట్ మార్కెట్లో పత్తి ధర మద్దతు ధరకు మించి పలకడంతో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కాలేదు. అదే విధంగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే మక్క, పెసర కొనుగోలు కేంద్రాలు సైతం ఏర్పాటు కాలేదు. అయినప్పటికీ మార్కెట్లకు ఆశించిన మేర ఆదాయం సమకూరింది. మద్దులపల్లి, మధిర వ్యవసాయ మార్కెట్లు మినహా మిగిలిన ఆరు మార్కెట్లూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది. మార్కెట్లకు అనుబంధంగా ఉన్న కూరగాయల మార్కెట్ల నుంచి, చెక్పోస్టుల నుంచి మంచి రాబడి ఉండడంతో టార్గెట్ ఈజీగా రీచ్ కావడానికి దోహమైంది.
మార్కెట్ ఆదాయం పెరగడానికి ధరల పెరుగదల కూడా మరోకారణంగా ఉంది. ఈ సంవత్సరం వానకాలం సీజన్ నుంచే మార్కెట్లలో అపరాలు, వాణిజ్య పంటల ధరలు పోటీపడి మరీ పెరిగాయి. పెసర మద్దతు ధర క్వింటాకు రూ.7,275 కాగా ప్రైవేటు మార్కెట్లో రూ.6,500 రూ.7,500 మధ్య పలికింది. కంది మద్దతు ధర క్వింటాకు రూ.6,300 కాగా ప్రస్తుతం మార్కెట్లో రూ.7,500 ధర పలుకుతోంది. ఖమ్మం, మధిర, ఏన్కూరు తదితర మార్కెట్లలో పత్తి, మిర్చి పంటల ధరలు ఆకాశాన్నంటాయి. పత్తి మద్దతు ధర రూ.6,025 కాగా ప్రైవేటు మార్కెట్లో రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకూ పలికింది. నిరుటితో పోల్చితే దాదాపుగా క్వింటాకు రూ.3,500 నుంచి రూ.4000 వరకూ అదనంగా పలికినట్లయింది. మిర్చి పంటకు మద్దతు ధర లేనప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో గరిష్ఠంగా రూ.23 వేల నుంచి రూ.24 వేల వరకూ పలుకుతోంది. ఇదే పంటకు నిరుడు రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకు మాత్రమే పలికింది. వీటితోపాటు హోల్సేల్ కూరగాయల మార్కెట్ నుంచి కూడా నిరుటితో పోల్చితే ఈసారి మంచి ఆదాయం వచ్చింది. ఖరీదుదారుల నుంచి సకాలంలో సెస్ వసూలు కావడం, పంటల కొనుగోళ్లలో తూచా తప్పకుండా జాగ్రత్తలు పాటించడం వంటి అంశాలు మార్కెట్ ఆదాయం పెరుగుదలకు కారణమయ్యాయి. పాలకవర్గ బాధ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేయడంతో మార్కెట్ల ఆదాయం మరింత పెరిగింది.
వ్యవసాయ మార్కెట్లు ఆశించిన మేర ఆదాయం ఆర్జించడంలో అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉంది. లక్ష్యాలను చేరుకునేందుకు సెక్రటరీలు, సిబ్బంది అవిశ్రాంగా పనిచేశారు. లక్ష్యాన్ని మించి ఆదాయం సమకూరడం సంతోషకరం. ప్రధాన పంటల దిగుబడులు కొంతమేరకు తగ్గుముఖం పట్టినా.. ఇతర వనరుల ద్వారా ఆదాయంపై పెరిగింది.
-కోలహాలం నాగరాజు, డీఎంవో, ఖమ్మం
జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదాయంలో ఖమ్మం ఏఎంసీది కీలకపాత్ర. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.26.05 కోట్ల ఆదాయం ఆర్జించడం శుభపరిణామం. టార్గెట్ కంటే రూ.కోటి ఆదాయం అధికంగా వచ్చింది. ఇంతటి అద్భుత ఆదాయ ఆర్జనకు కారకులైన వ్యాపారులు, రైతులు, కార్మికులు, మార్కెట్ అధికారులకు ప్రత్యేక అభినందనలు.
-దోరేపల్లి శ్వేత, ఏఎంసీ చైర్పర్సన్, ఖమ్మం