గుండాల, ఫిబ్రవరి 28: నియోజకవర్గంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. మండలంలోని యాపలగడ్డ పగిడిద్దరాజు గద్దెల వద్ద సుమారు రూ.రెండు కోట్లతో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నిరుపేదల సొంతింటి కలను దశల వారీగా నెరవేర్చుతామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియగానే సొంత జాగలో ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. తెలంగాణ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మారుమూల ఏజెన్సీలోని గుండాల, ఆళ్లపల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎల్డబ్లూఎస్ నిధులతో రహదారులన్నింటినీ పూర్తి చేసుకున్నామన్నారు. రూ.40 కోట్లతో గుండాల మండలంలోని ముత్తాపురం గ్రామం వద్ద నూతనంగా ఏకలవ్య పాఠశాలను నిర్మిస్తున్నట్లు గుర్తుచేశారు.
అనంతరం మండలంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తరువాత గుండాల మండల కేంద్రంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న నూతన తహసీల్థార్ కార్యాలయ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దొంగతోగు గ్రామానికి వెళ్లేందుకు కిన్నెరసాని వాగుపై రూ.8 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తరువాత వివిధ గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ కోరం సీతారాములు, తహసీల్దార్ నాగదివ్య, పీఏసీఎస్ చైర్మన్ గొగ్గెల రామయ్య, ఆర్ఎండ్బీ డీఈ వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నాయకులు తెల్లం భాస్కర్, మోకాళ్ల వీరస్వామి, సయ్యద్ అజ్జు తదితరులు పాల్గొన్నారు.