సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 10 : కృష్ణా జలాల పరిరక్షణ కోసం ఈ నెల 13వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అధినేత కేసీఆర్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తరలిరావాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో సండ్ర మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జలాలు, సంపద విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదని, స్వరాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ ప్రజలకు కృష్ణా, గోదావరి జలాలు అందడంతోపాటు తెలంగాణ సంపద తరలిపోదని భావించి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని పదేళ్లు పాలించి కృష్ణా జలాలను కేంద్రం నుంచి పోరాడి నాగార్జునసాగర్ కాలువల ద్వారా తెలంగాణ ప్రజలకు అందించారన్నారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు రాష్ర్టాలను గుప్పిట్లో ఉంచుకోవాలని భావించి కృష్ణా యాజమాన్య బోర్డును కేంద్రానికి అప్పగించాలని, సీఆర్కే పరిధిలోకి బోర్డును తీసుకురావాలని చూస్తోందన్నారు. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో జలాల అంశంపై ఏర్పాటైన సమావేశంలో ఎటువంటి అభ్యంతరం చేయకపోగా.. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కృష్ణా జలాలు తరలిపోయేలా చూశారని విమర్శించడం తగదన్నారు. ఇందుకోసం రాజకీయాలకతీతంగా తెలంగాణలోని అన్ని పార్టీలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. 13న నల్గొండలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని సండ్ర కోరారు. అనంతరం నల్గొండ బహిరంగ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
సంఘటితంగా పోరాడుదాం..
నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులపై ఎక్కడైనా దాడి జరిగితే శ్రేణులందరూ సంఘటితంగా పోరాడాలని సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నియోజకవర్గంలో గత, ఇప్పటి పాలకుల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు రఫీ, కోఆప్షన్ సభ్యుడు పాషా, సొసైటీ అధ్యక్షుడు చల్లగుళ్ల కృష్ణయ్య, డీసీసీబీ డైరెక్టర్ మోదుగు పుల్లారావు, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సదాశివునిపాలెం మాజీ ఉప సర్పంచ్ కాలినేని వెంకటేశ్వరరావు, గంగారం మాజీ సర్పంచ్ మందపాటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్డా శంకర్రావు, జొన్నలగడ్డ శ్రీను, వల్లభనేని పవన్, మాధురి మధు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.