భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం కోసం గురువారం కొత్తగూడెం వస్తున్న సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలుకుదామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆయన చొరవ వల్లే కొత్తగూడెం నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందని అన్నారు. కొత్తగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను ఇటీవల కరీంనగర్ వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్ తనకు స్వయంగా ఫోన్ చేశారని అన్నారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి తాను కొత్తగూడెం వస్తున్నానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తర్వాత కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోనే అంతటి అభివృద్ధి జరిగిందని అన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్ను గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభించుకోబోతున్నామని అన్నారు. గురువారం మధ్యా హ్నం 2 గంటలకు కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించి సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఆ తర్వాత బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్నీ ప్రారంభిస్తారన్నారు. సీఎంకు స్వాగతం పలికేందుకు కొత్తగూడేన్ని తీర్చిదిద్దామని అన్నారు. అలాగే ఖమ్మంలో ఈ నెల 18న జరిగే సభకు కూడా కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి పాల్గొన్నారు.