గతంలో రహదారులపై ప్రయాణం చేయాలంటే నరకం కనిపించేది. గుంతల రోడ్లపై పడుతూ లేస్తూ ప్రయాణం చేయాల్సి వచ్చేది. అడుగడుగునా గుంతలు.. అతుకుల బొంతలా ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించారు. దీంతో రహదారుల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మారుమూల పల్లెల్లోనూ అద్దంలా మెరిసే రహదారులు నిర్మించారు. ప్రయాణంలో వేగం పెరిగింది. రోడ్లపై వాహనాలు రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నాయి. ప్రతి జిల్లాలో గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లను సింగిల్ నుంచి డబుల్ రోడ్లుగా మార్చారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకునే రోడ్లను ఫోర్లేన్ రోడ్లుగా మలిచారు. అంతేకాదు నదులు, వాగులపై వంతెనలు, కల్వర్టులు నిర్మించారు. కొత్తగా లింక్ రోడ్లు నిర్మించి ఏజెన్సీవాసులకు మెరుగైన రవాణా వసతులు కల్పించారు. గతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వెళ్లిన వాహనాలు రోడ్ల విస్తరణ తర్వాత ఇప్పుడు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి.
ఖమ్మం, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామాలకు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండేవి. అందుకు కారణం సరైన రోడ్లు లేకపోవడమే అన్నది సుస్పష్టం. రాష్ట్రీయ రహదారుల పరిస్థితి అయితే అడగుకో గుంత.. అతుకుల బొంతలా ఉండేది.. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిండా గతుకులే. ఇక వానకాలం వస్తే చిన్న సైజు స్విమ్మింగ్ పూల్స్. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లాలన్నా, అక్కడి నుంచి జిల్లాకేంద్రాలకు వెళ్లాలన్నా ప్రయాణికులకు ప్రహసనమే. గతుకుల రోడ్ల కారణంగా ఆరోజుల్లో ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది. గ్రామీణ రహదారుల్లో ఎదరెదురుగా వాహనాలు ఢీకొనేవి. నిత్యం ఏదో ఒకచోట ప్రాణాలు గాలిలో తేలిపోయేవి. తెలంగాణ సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ రోడ్లు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి జిల్లాలో గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లను సింగిల్ రోడ్ల నుంచి డబుల్ రోడ్డుగా మార్చారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకునే రోడ్లను ఫోర్లైన్ రోడ్లుగా మలిచారు. అంతేకాదు నదులు, వాగులపై వంతెనలు, కల్వర్టులు నిర్మించారు. కొత్తగా లింక్ రోడ్లు నిర్మించి ఏజెన్సీవాసులకు మెరుగైన రవాణా వసతులు కల్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, రోడ్లు భవనాలశాఖ అధికారులు రహదారుల నిర్మాణంపై దృష్టి సారించారు. ప్రతిష్ఠాత్మకంగా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న రహదారుల విస్తరణ చేపట్టారు. రోడ్ల విస్తరణ తర్వాత గతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వెళ్లిన అవే వాహనాలు ఇప్పుడు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి.
తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్లు భవనాలశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా రూ.143.46 కోట్లు వెచ్చించి 439.88 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం, విస్తరణ, రూ.25.83 కోట్లతో తొమ్మిది బ్రిడ్జీలు నిర్మించారు. అవసరమైన చోట వంతెనలు, బ్రిడ్జిలు నిర్మించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూ.402.96 కోట్లు వెచ్చించి 751.016 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించారు.
గతంలో సరైన రవాణా వసతి లేక మేం ఇబ్బందిపడ్డాం. స్వరాష్ట్రం వచ్చిన వెంటనే చింతకాని- ఖమ్మం రోడ్డు డబుల్ రోడ్డు మంజూరైంది. అనతి కాలంలోనే రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఇప్పుడు ప్రయాణికులు, కూలీలు, విద్యార్థులు సునాయాసంగా జిల్లాకేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. రహదారి విస్తరణతో పాటు రోడ్డు పక్కన మొక్కలు నాటించడంతో ఇప్పుడా రహదారి ఆహ్లాదకరంగా కనిపిస్తున్నది.
– తాతా ప్రసాద్, సొసైటీ డైరెక్టర్, చింతకాని
కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాల్లోని అన్ని రోడ్లకూ మహర్దశ పట్టింది. నూతన రోడ్ల నిర్మాణంతోనే గ్రామాలకు రాకపోకలు సులభమయ్యాయి. పూర్తయిన రోడ్లు, లింకు రోడ్ల విస్తరణతో పల్లెలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. భవిష్యత్ ఆలోచనతో సీఎం కేసీఆర్ రోడ్లను నిర్మిస్తున్నారు. దీంతో పల్లెలు కూడా అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెలను తీర్చిదిద్దుతున్నందుకు సంతోషంగా ఉంది. కేసీఆర్ సర్కారుకు మా గ్రామ ప్రజలందరూ రుణపడి ఉంటారు.
-సూదగాని సంగయ్య, చింతగుర్తి, రఘునాథపాలెం మండలం
గతంలో గ్రామానికి ఒక్క సీసీ రోడ్డు వేయాలంటేనే సంవత్సరాల సమయం పట్టేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పల్లెల్లోని ప్రతి వీధిలోనూ సీసీ రోడ్లు వేశారు. వీటితోపాటు గ్రామాల అనుసంధానంగా ఉన్న రోడ్లను బీటీలుగా తీర్చిదిద్దారు. ఆ రోడ్లన్నింటినీ డబుల్ లైన్లుగా విస్తరించి విశాలంగా చేశారు. మా గ్రామం మీదుగా వెళ్లే కోయచలక ప్రధాన రోడ్డును విస్తరించడంతో ఇతర గ్రామాలకు ప్రయాణం సులభతరమైంది. పల్లెలో జరిగిన రోడ్లు విస్తరణతో ఏ రోడ్డులో వెళ్లినా త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలిగింది.
-నున్నా శ్రీనివాసరావు, రేగులచలక, రఘునాథపాలెం మండలం
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి గ్రామంలో బీటీ, సీసీ రోడ్లు నిర్మించారు. ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచింది. గతంలో గ్రామాల్లో గుంతల రహదారులు ఉండేవి. గ్రామాల్లో ప్రధాన రహదారులకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్లు, లింక్ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. అద్దంలా రహదారులు నిర్మించడంతో ప్రజల ప్రయాణమూ సాఫీగా సాగుతున్నది.
– కూసంపూడి మహేశ్, మున్సిపల్ చైర్మన్, సత్తుపల్లి
గత ప్రభుత్వాల హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లే ఉండేవి. ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పుడా పరిస్థితి కనుమరుగైంది. రాష్ట్రప్రభుత్వం ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు నిర్మించింది. గ్రామాల నుంచి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోనూ డబుల్ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి.
– మందపాటి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్, గంగారం, సత్తుపల్లి మండలం
మాది వనంవారి కృష్ణాపురం. నేను ఫొటోగ్రాఫర్గా పనిచేసుకుంటున్నాను. వృత్తిరీత్యా ప్రతిరోజూ ఖమ్మం నగరానికి వెళ్తుంటాను. 2014కు పూర్వం ఖమ్మం- వల్లభి రహదారి సింగిల్ రోడ్డు మాత్రమే. ఈ రోడ్డు తెలంగాణ ఆంధ్రాప్రాంతాలకు మధ్య వారధి. ఆ సమయంలో ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల రద్దీ ఉండేది. సింగిల్ రోడ్డు కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండేవి. 2015లో రోడ్డు డబుల్ రోడ్డు అయింది. మరోవైపు న్యూ లక్ష్మీపురం – వెంకటగిరి రోడ్డూ విస్తరణకు నోచుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాతే రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం పెరిగింది.
– గోదా నరేందర్, గ్రామస్తుడు, వనంవారి కృష్ణాపురం, ముదిగొండ మండలం