దుమ్ముగూడెం, మే 10: అర్హులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు త్వరలో ఆర్వోఆర్ పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. అడవులు పరిరక్షణ, ఆదివాసీల రక్షణకు బీఆర్ఎస్ అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. తునికాకు కార్మికులకు మంజూరైన బోనస్ చెక్కులను మండలంలోని ములకపాడు ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016 నుంచి 2021 వరకు భద్రాద్రి జిల్లాకు మొత్తం రూ.80.73 కోట్ల బోనస్ మంజూరైనట్లు చెప్పారు. భద్రాచలం నియోజకవర్గంలో 35,396 మందికి రూ.27.56 కోట్లు, పినపాక నియోజకవర్గంలో 43,616 మందికి రూ.33.59 కోట్లు, అశ్వారావుపేట నియోజకవర్గంలో 11,081 మందికి రూ.4.51 కోట్లు, కొత్తగూడెం నియోజకవర్గంలో 5,502 మందికి రూ.2.74 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గంలో 29,726 మందికి రూ.12.31 కోట్లు చెల్లిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఆరు డివిజన్లలో 28 యూనిట్లలో 620 కల్లాలను ఏర్పాటు చేసి 32,300 స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించి విక్రయించాలనే అటవీ అభివృద్ధి సంస్థ లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. తొలుత ప్రభుత్వ విప్ రేగా, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలతో కలిసి మంత్రి అల్లోల మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు.
అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు: ప్రభుత్వ విప్
తెలంగాణ రాజకీయ స్వార్థపరులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పోడు పట్టాల విషయంలో కొందరు స్వార్థపరులు గిరిజనుల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రామరాజ్య పాలన సాగుతోందని అన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, అటవీ శాఖ అధికారులు ఎం.దోబ్రియల్, భీమానాయక్, లక్ష్మణ్ రంజిత్నాయక్, మక్సుద్ మొహిద్దీన్, ప్రసాద్, కనకమ్మ, ఉపేందర్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులుమ రేసు లక్ష్మి, తెల్లం సీతమ్మ, అన్నెం సత్యనారాయణమూర్తి, కణితిరాముడు పాల్గొన్నారు.