భద్రాచలం, జనవరి 12 : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా 27వ రోజును పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి 108 పాత్రల్లో పరమాన్నాన్ని భక్తిశ్రద్ధలతో నివేదించారు. అనంతరం ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆండాళ్ అమ్మవారిని, శ్రీకృష్ణ పరమాత్మను బేడా మండపంలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత తిరుప్పావైలోని పాశురాన్ని అర్చకులు పఠించారు. ఆండాళ్ అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మతో తనకు వివాహం జరిగితే 108 గంగాళాలతో పాయసాన్ని నివేదన చేస్తానని మొక్కుకుంటుంది.
ఆ సమయంలో అమ్మవారికి శ్రీకృష్ణ పరమాత్మతో వివాహం కావడంతోపాటు ఆయనలో ఐక్యమయ్యారు. దీంతో ఏటా ధనుర్మాసోత్సవాల్లో భాగంగా కూడారై ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేక పల్లకీలో తీసుకొచ్చి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే సీతారామ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో, అహోబిల మఠంలోనూ కూడారై ఉత్సవాన్ని వైభవంగా జరిపారు.