Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : జానెడు జాగ దొరికితే చాలు.. బారెడు అక్రమం చేయడానికి సిద్ధమవుతారు అక్రమార్కులు. సర్కారు భూమిలో ఉన్న మామిడితోటలో ఓ కంట్రాక్టర్ ఏకంగా చెరువునే తవ్వేస్తున్నాడు. అటువైపు ఎవరూ రారన్న ధైర్యంతో లీజుకు తీసుకున్న మామిడితోటలో చెరువుని నిర్మిస్తున్నాడు. వివరాల్లోకెళ్తే.. చుంచుపల్లి మండలం గరిమళ్లపాడు ఉద్యానవనంలో మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడిమామిడి, సపోట పండ్ల మొక్కలు చాలా ఎకరాల్లో ఉన్నాయి. ఈ తోటలను ప్రతి ఏటా ఐటీడీఏ ఆధ్వర్యంలో కేవలం ఫలసాయం పొందడం కోసం వేలం వేస్తారు. ఇదే క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగేళ్లకు లీజుకు వేలంపాట పెట్టారు. ఉద్యాన కమిటీ ద్వారా నిర్వహించే ఈ పాటకు చైర్మన్గా ఐటీడీఏ పీవో ఉంటారు. జిల్లా ఉద్యాన అధికారి, ఐటీడీఏ ఉద్యాన అధికారులతోపాటు తహసీల్దార్ కూడా కమిటీలో ఉంటారు. నాలుగేళ్లకు లీజులో పాల్వంచకు చెందిన కంట్రాక్టర్ ఒకరు 6 లక్షల ఒక వెయ్యికి పాటను దక్కించుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే లీజుకు తీసుకున్న ప్రదేశంలో అక్రమంగా చెరువు తవ్వడం మరో ట్విస్టుగా మారింది.
గరిమళ్లపాడు ఉద్యానవనంలో అక్రమం చోటుచేసుకున్నది. తోటలను పెంచడానికి అందులో బోర్లు ఉన్నా సదరు కాంట్రాక్టర్ అక్రమంగా చెరువును తవ్వుకోవడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ చెరువు అవసరం ఉంటే అధికారుల అనుమతి తీసుకోవాలి.. కాని ఎలాంటి అనుమతులు లేకుండా రెండునెలల నుంచి తోటల మధ్యలో చెరువును తవ్వడంపై అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా అది తోటల కోసం వేసే చెరువేనా లేక చేపల పెంపకం కోసం తవ్వుతున్న చెరువా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా నీటి సదుపాయం కోసం చెరువు అయితే బయట ఉన్న బోరు నుంచి మోటార్ కనెక్షన్ లైన్ ఎందుకు ఇస్తున్నారో దానిని చూస్తే అర్థం అవుతుంది. నిజంగా తోటల కోసం అయితే అధికారులతో చెరువు తవ్వించాల్సి ఉంటుంది. కంట్రాక్టర్ ఎందుకు చెరువు తవ్విస్తున్నారో అర్థం కాని విషయం.
గరిమళ్లపాడు ఉద్యానవనంలో ఏనాటి నుంచో ఉద్యానవనం ఉన్నా పట్టించుకునే నాధుడే లేడు. ఒకప్పుడు కళకళలాడిన ఉద్యానవం.. నేడు మొక్కలు లేక కళావిహీనం అయ్యింది. ఎండిపోతున్న మొక్కలతో ఎండమావిగా మారింది. ప్రస్తుతం మామిడి మొక్కలు 800, నిమ్మ రెండు ఎకరాల్లో, కొబ్బరి 140 మొక్కలు, సపోటా 80 మొక్కలు ఇంకా ఇతర మొక్కలు కూడా ఉన్నాయి. వీటి ఫలసాయం పరులపాలవకుండా ప్రతి ఏటా ఏడాది లీజుకు ఇస్తున్నారు. వాటి లెక్కలు కూడా అడిగేవారు లేరు. దీంతో ఎవరికివారు యమునా తీరు చందంగా ఉంటే కాంట్రాక్టర్ అక్రమానికి తెరలేపాడు.
30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నర్సరీలో ఏపుగా పెరగాల్సిన పండ్ల మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. మొక్కల ఆలనాపాలన చూడాల్సిన ఐటీడీఏ అధికారులు కూడా అటువైపు తలెత్తడం లేదు. ఊరికి దూరంగా ఉండడంతో రాత్రి సమయంలో మందుబాబులకు అడ్డాగా మారింది. అసాంఘిక కార్యక్రమాలకు సైతం స్థావరంగా మారింది.
గరిమళ్లపాడు ఉద్యానవనాన్ని లీజుకు ఇచ్చాం. అధికారికంగా వేలంపాట నిర్వహించాము. నాలుగేళ్లపాటు రూ.6 లక్షలకు లీజుకు ఇచ్చాం. అందులో తోటలకు నీరు పెట్టుకోవడానికి మోటార్ కూడా ఉంది. కొన్ని రిపేర్లు ఉన్నాయి. కాని చెరువు తవ్వుతున్నట్లు మా దృష్టికి ఇప్పుడే వచ్చింది. మేము ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కంట్రాక్టర్కి నోటీసులు ఇస్తాం. ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ వాచ్మెన్ కూడా ఉంటారు.