దమ్మపేట రూరల్/ దమ్మపేట, ఏప్రిల్ 17: రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి కృషితోనే సాధ్యమవుతుందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్ క్రైమ్ వల్ల నష్టపోతే తిరిగి డబ్బు సంపాదించుకోవచ్చని, కానీ, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణం పోతే తిరిగి తెచ్చుకోలేమనే అంశాన్ని గుర్తించాలన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం వంటి నిర్లక్ష్యానికి చెల్లించే మూల్యం వెలకట్టలేనిదన్నారు. జిల్లాలో 2025లో 238 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, ద్విచక్ర వాహనదారులు తలకు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు డ్రైవర్తోపాటు తోటి ప్రయాణికులు సీట్ బెల్టు తప్పని సరిగా ధరించాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతీ పౌరుడు బాధ్యతగా భావించాలన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో మనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వాహనాలు నడిపే క్రమంలో సెల్ ఫోన్ వాడొద్దని సూచించారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లే విధంగా ప్రతీ ఒక్కరినీ చైతన్యపరచాలన్నారు. జిల్లాలో 38 బ్లాక్ స్పాట్లు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ దేశంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా లక్ష మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడానికి ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.