భద్రాచలం, డిసెంబర్ 17: భద్రాచలం పట్టణంలో గోదావరిపై నిర్మిస్తున్న రెండో వారధి పనులను సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి వారధి పనులను పరిశీలించారు. వారధి నిర్మాణానికి 2015లో నాడు తాను మంత్రి హోదాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. పనుల్లో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, వారం రోజుల్లో పనులను ప్రారంభించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రహదారి పనులను ప్రారంభించాలన్నారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి మట్టి దొరకడం లేదని సైట్ ఇంజినీర్ చెప్పిన సమాధానంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు, ఏజెన్సీలు సమగ్ర నివేదికలతో త్వరలో కలెక్టరేట్లో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. పర్యటనలో ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న, అదనపు కలెక్టర్ రాంబాబు, ఎన్హెచ్ ఈఈ యుగంధర్, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, ఆర్డీవో మంగీలాల్ తదితరులున్నారు.