ఖమ్మం, మే 16 : ప్రశాంతంగా ఉన్న ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులు కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం హెచ్చరించారు. సోమవారం నగరంలోని మంత్రి పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీకి చెందిన గల్లీ కార్యకర్త సాయిగణేశ్కు మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి చిల్లరగా మాట్లాడడం సరికాదన్నారు. పక్క రాష్ట్రంలో మాజీ సీఎం సోదరుడిని హత్య చేసి నాలుగేండ్లు అవుతున్నా ఆ కేసును సీబీఐ ఇంతవరకు పరిష్కరించలేదన్నారు. తెలంగాణలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.
బండి సంజయ్ తొండి సంజయ్గా మారాడని, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఖమ్మానికి ఏమి చేశారో చెప్పాలని అన్నారు. ఖమ్మంలో జరిగిన కమ్మ సంఘం ఎన్నికల గురించి సంజయ్ మాట్లాడటం సిగ్గుచేటని, ఆయన పక్కనే ఉన్న కమ్మ నాయకుడికి బీజేపీ ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో కులాలు, మతాల గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ అమలు చేసే పథకాలకు పేర్లు మార్చి వారు పాలించే రాష్ర్టాల్లో అమలుచేస్తున్న బీజేపీ ఇప్పటికైనా కేసీఆర్ అంటే ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. మంత్రి అజయ్పై బురద చల్లాలని చూసినా.. అవాకులు, చెవాకులు పేలినా టీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, తాజుద్దీన్, బొమ్మెర రాంమ్మూర్తి, వీరూనాయక్, చింతనిప్పు కృష్ణచైతన్య, కార్పొరేటర్లు పసుమర్తి రామ్మోహన్రావు, దాదే అమృతమ్మ, వలరాజు పాల్గొన్నారు.