భద్రాద్రి కొత్తగూడెం, మే 5 (నమస్తే తెలంగాణ) : పోరాడి సాధించుకున్న తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటూ సరికొత్త డ్రామాలను తెరతీస్తోంది. దీంతో చెంతకు చేరువైన పాలన మళ్లెక్కడ దూరమవుతుందోనని భద్రాద్రి జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం జిల్లాను తీసేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తెలంగాణను తెచ్చిన ఉద్యమసారథి కేసీఆర్. తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో రాష్ర్టాన్ని తీర్చిదిద్దారు. పాలనను ప్రజలకు మరింత చేరువచేస్తూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కానీ కేసీఆర్ దూరదృష్టిని సహించలేని ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి.. ఉద్యమనేత ఆలోచనల ఆనవాళ్లు కన్పించకుండా కొత్త జిల్లాలను తీసివేసేందుకు సరికొత్త విధానాలను తెరపైకి తెచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టారు. దీంతో జిల్లా అంతటా ‘భద్రాద్రి జిల్లా రద్దు’ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే, చెంతకు చేరిన పాలనను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్కు.. ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు.
కొత్త జిల్లాను రద్దు చేస్తే దూరపు మండలాల ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలైనట్లే అవుతుంది. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాలు పూర్వ జిల్లా కేంద్రమైన ఖమ్మానికి సుమారు 150 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. ఏదైనా పనిమీద జిల్లా కేంద్రానికి రావాలంటే అంతుకుముందు రోజు రాత్రే బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. వచ్చిన ప్రజలు అధికారులు కలుసుకోవాలన్నా.. లేదంటే అధికారులు సదరు గ్రామాలకు వెళ్లాలన్నా ప్రహసనమే. ఈ స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్.. సరికొత్త ఆలోచనలో నూతనంగా భద్రాద్రి జిల్లాను ఏర్పాటు చేసి పాలనను ప్రజల చెంతకు చేర్చారు. నూతన కలెక్టరేట్ ఏర్పాటుతో అధికారులందరినీ ఒకే సముదాయంలో అందుబాటులో ఉంచారు. అదీగాక జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి అన్ని విధాలా తీర్చిదిద్దారు. దీనికితోడు కొత్త మెడికల్, నర్సింగ్ కళాశాలను చెంతకు చేర్చారు. అలాగే, మారుమూల గ్రామాల నుంచి బయలుదేరిన ప్రజలు కూడా ఉదయాన్నే జిల్లా కేంద్రానికి చేరుకొని పనులను పర్యవేక్షించుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకునేంత వెలుసుబాటు కలిగింది. గ్రామాలకు వెళ్లి వచ్చేందుకు అధికారులకూ సమయం కుదురుతోంది. దీంతో అన్ని విధాలా ప్రజలు మేలు జరుగుతోంది. కానీ కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను తొలగించి ఆయన ఆనవాళ్లను చెరిపేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా కన్పిస్తోంది. అయితే ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు, కేసీఆర్ ప్రభుత్వ ఆనవాళ్లు చెరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కొత్త జిల్లా తొలగింపు ఆలోచనలపై జిల్లాపై గుర్రుగా ఉన్నారు.
భద్రాద్రి జిల్లా తొలగింపు ప్రక్రియ చేపట్టడం వల్ల జరిగే పరిణామాలపైనా ప్రజలు అనేక భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాను తీసేస్తే ఉద్యోగులంతా మళ్లీ పాత జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే జోనల్ వ్యవస్థ ద్వారా కొత్త ఉద్యోగాలకు అవకాశం కల్పించడం, ఎవరి జిల్లాలో వారే ఉద్యోగాలు చేసుకునే వీలు కల్పించడం వంటివి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. సుమారు 5 వేల మంది ఉద్యోగులు కొత్త జిల్లాలో పనిచేస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో అభివృద్ధిలో జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ తీరును కొత్త జిల్లా తిరోగమనపాలయ్యే ప్రమాదముందని జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేరువగా ఉన్న పాలనను ప్రజలకు దూరం చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అప్పుడు వాజేడు నుంచి ఖమ్మం వెళ్లాలంటే అష్టకష్టాలు తప్పేవికావు. రానూపోనూ రెండు రోజులూ ప్రయాణానికే సరిపోయేది. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక ఈ ఇబ్బందులు తప్పాయి. గంటలు, నిమిషాల వ్యవధిలోనే ప్రజలు జిల్లా కేంద్రాలకు చేరుకొని పనులు పర్యవేక్షించుకోగలుగుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటే ప్రజలే తరిమికొడతారు.
ఎవరైనా అభివృద్ధి చేస్తుంటే ప్రజలు స్వాగతిస్తారు. కానీ పాత ప్రభుత్వం మీద కోపంతో చేసిన అభివృద్ధిని ఎవరైనా చెరిపేస్తారా? కొత్త జిల్లాలను తీసివేయాలని ప్రస్తుత ప్రభుత్వం చూడడం దుర్మార్గం. జిల్లా అధికారులు మా గ్రామానికి రావాలంటే అప్పుడు నెలలు పట్టేది. ఇప్పుడు రెండురోజులకు ఒకసారి వచ్చిపోతున్నారు. పెద్ద జబ్బు వస్తే వెంటనే కొత్తగూడెం వెళ్లగలుగుతున్నాం. మళ్లీ పాత జిల్లాలో కలిపితే తప్పని పరిస్థితిలో ఖమ్మం వెళ్లాలి. అది ఎంతో భారం.