మధిర టౌన్, అక్టోబర్ 26: ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఎప్పుడూ హైదరాబాద్లోనే మకాం వేస్తారని, ప్రజాసంక్షేమం ఆయనకు ఏమాత్రం పట్టదని బీఆర్ఎస్ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే స్థానికంగా ఉండి పట్టణాభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. బుధవారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానన్నారు. తాను ఎమ్మెల్యే కాకపోయినా జడ్పీ చైర్మన్గా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు రాబట్టానని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే మధిర పట్టణ రూపురేఖలు మారాయన్నారు. ప్రచారంలో నాయకులు పల్లపోతుల వెంకటేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్, బోయపాటి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, భోగ్యం ఇందిర, ప్రియాంక, జగన్, భువనగిరి నారాయణ, అప్పారావు పాల్గొన్నారు.